వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడే నాయకుల్లో ఎప్పుడూ ముందుంటారు టిడిపి మాజీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు. ఆయన మొదటి నుంచి దూకుడు స్వభావంతో ఉంటూనే వస్తుండడం, ఆయనతో అనేక చిక్కులు తెచ్చిపెట్టింది అని అంటున్నారు కొందరు విశ్లేషకులు! సబ్జెక్ట్ మీద పక్కాగా మాట్లాడటం కంటే.. నోరేసుకుని పడిపోవడానికి ఆయన అధిక ప్రాధాన్యత ఇస్తారని రోజా లాంటి నేతలు కూడా విమర్శించారు. ఈ క్రమంలో ఆ దూకుడు స్వభావం కారణంగానే ఏపీ టీడీపీ అధ్యక్ష పదవి ఇవ్వాలన్న ఆలోచన నుంచి చంద్రబాబు వెనక్కి తగ్గారని అంటున్నారు! ఆ సంగతి అలా ఉంచితే… ఈ అనాలోచిత దూకుడే నేడు అచ్చెన్న పరిస్థితికి వన్ ఆఫ్ ద రీజన్ అని ఆన్ లైన్ లో విశ్లేషణలు మొదలైపోయాయి.
టీడీపీ నుంచి గెలిచిన వారూ ఓడినవారూ అనే తారతమ్యాలు లేకుండా… వరుసగా సైకిల్ దిగిపోతున్న పరిస్థితుల్లో ఇప్పటికే టీడీపీ చాలా ఇబ్బందుల్లో ఉంది. ఈ పరిస్థితుల్లో సీబీఐ ఎంక్వైరీ, అచ్చెన్న నాయుడు అరెస్టు టీడీపీని మరింత కుదేళుచేసేస్తున్నాయనే చెప్పాలి. ఆ సంగతులు అలా ఉంటే… ఇది ఆరంభం మాత్రమే అని, ఇది జస్ట్ చిన్న ట్రైలర్ అని, అసలు సినిమా ముందుందని వైకాపా నేతలు చెబుతున్న పరిస్థితి చూస్తుంటే… వైకాపా భారీ స్కెచ్ తోనే ముందుకు వెళ్తున్నట్లు కనిపిస్తుంది! అయితే ఇందుకు వారు ఎంచుకున్న మరో ప్రధాన కారణం… అచ్చెన్నతో పాటు మరో ముగ్గురు నలుగురు అదేపనిగా వైసీపీ ప్రభుత్వం పై విమర్శలు చేస్తూ, ప్రజల్లో ప్రభుత్వంపై చులకన భావం ఏర్పడే విధంగా వ్యవహరిస్తున్న తీరే అని అంటున్నారు!!
ప్రభుత్వ పనితీరుపైనా, పథకాలపైనా చేసే విమర్శల సంగతి అటుంచితే… జగన్ ను వ్యక్తిగతంగా విమర్శించడం, వ్యక్తిగత దూషణలకు దిగడంలో అచ్చెన్న పాత్ర కీలకం. అచ్చెన్న అనంతర స్థానాల్లో మరో ముగ్గురు నలుగురు ఉన్నారని తెలుస్తుంది. తమపై ఆరోపణలు చేస్తున్న వారు గతంలో భారీ ఎత్తున కుంభకోణాలకు, అవకతవకలకు పాల్పడ్డారనే ఆధారాలు జగన్ దగ్గర పక్కాగా ఉన్నాయని అంటున్నారు. దానిని సాక్ష్యాధారాలతో సహా నిరూపించి వారు నోరెత్తకుండా చేయాలన్నది వైసీపీ ప్లాన్ గా కనిపిస్తోంది.