ఎవరూ ఊహించని స్థాయిలో భారీ మెజారిటీతో అధికారం చేపట్టారు వైఎస్ జగన్. అయితే… అధికారం చేపట్టినప్పటినుంచీ సంక్షేమ పథకాలపైనా, పరిపాలనపైనా పూర్తి దృష్టి కేంద్రీకరిస్తూనే… మరోవైపు ప్రతిపక్షాన్నీ రాజకీయంగా ఎన్ని రకాల దెబ్బలు కొట్టొచ్చో కూడా ఆలోచిస్తూనే ఉన్నట్లున్నారు. అందులో భాగంగానే టీడీపీ ఉన్న ఉన్న 23 మందిలో ముగ్గురు సైకిల్ దిగిపోయేలా చేశారు! ఇదే క్రమంలో మరికొంతమంది సీనియర్ టీడీపీ నేతలు ఫ్యాన్ కిందకు చేరిపోయారు! ఈ క్రమంలో ఇక బాబును మామూలు ఎమ్మెల్యే చేయాలనేదే జగన్ నెక్స్ట్ ప్లాన్ గా ఉందని అంటున్నారు విశ్లేషకులు!
చంద్రబాబు ప్రస్తుతం ఏపీ అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. అది కూడ కేబినెట్ హోదానే! ఆ హోదాతోనే బాబు గత ఏడాదిగా జగన్ ని చెడుగుడు ఆడిస్తున్నారు. తాను మామూలు ఎమ్మెల్యేని కాదని, ప్రతిపఖ నేతను అని అసెంబ్లీలో మాట్లాడటానికి తాను అవకాశాలు సరిగా ఇవ్వడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు కూడా. దీంతో… ఆ కుర్చీ నుంచి బాబుని దించేయాలని జగన్ డిసైడ్ అయ్యారట. ఇందులో భాగంగా వల్లభనేని వంశీ, మద్దాలి గిరి, కరణం బలరాంలు పసుపు కండువాలు తీసేయడంతో టీడీపీ బలం అనధికారికంగా 23 కాస్తా 20 అయ్యింది.
ఈ క్రమంలో మరో ముగ్గురు సభ్యులు గనుక ఇదే తరహాలో దూరమైతే బాబుకు ప్రతిపక్ష హోదా ఉండదు! దాంతో ఆ పనికాస్తా పూర్తిచేయాలని జగన్ భావిస్తున్నారంట. అది ఈ అసెంబ్లీ సెషన్స్ లోనే జరిగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఈ నెల 19న చూద్దాం అని విజయసాయి రెడ్డి ఇన్ డైరెక్టుగా ట్వీటిన ట్వీటే దీనికి ఉదాహరణ అని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ క్రమంలో శాసనమండలి రద్దు విషయంలో కూడా జగన్ పట్టుదలగా ఉన్న సంగతి తెలిసిందే. దాంతో యనమల హోదాకూడా హుష్ కాకీ అయిపోనుంది! ఈ రెండూ జరిగితే… బాబు సాధారణ ఎమ్మెల్యేగా మిగిలిపోనుండగా.. యనమల మాజీ ఎమ్మెల్యేగా మిగిలిపోనున్నారు!! అనంతరం నెక్స్ట్ టార్గెట్ వారేనంటున్నారు!