సొంత పార్టీ ఎంపీ పదేపదే వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ, ప్రతిపక్షాలకు ఆయుధాలను అందిస్తుండడం వైసీపీ నాయకులకు మింగుడుపడటంలేదు. నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఇప్పుడు కొద్దిరోజులుగా అదేపనిగా జగన్ పైనా, వైసీపీ ప్రభుత్వం పైనా విమర్శలు చేస్తూ వస్తున్నారు.
ఒక పక్క తెలుగుదేశం పార్టీని తాము ఇబ్బందులకు గురి చేస్తున్నామని, ఆ పార్టీ నుంచి పెద్దఎత్తున నాయకులను చేర్చుకుని టిడిపికి ఝలక్ ఇవ్వబోతున్నామని, అలాగే ఇప్పటికే టిడిపి నాయకులు కొంత మందిని అరెస్టు చేసి జైలుకి పంపించి తెలుగుదేశం పార్టీకి గట్టిషాక్ ఇచ్చామనే సంతోషంలో వైసిపి నాయకులు ఉండగా రఘురామ రామకృష్ణం రాజు పార్టీకి చాలా ఇబ్బందికరంగా తయారయ్యారు.దీంతో జగన్ రంగంలో దిగి నేరుగా ఆయన్నే టార్గెట్ చేసే కార్యక్రమం చేపట్టినట్లు కనిపిస్తోంది.జగన్కు అతి సన్నిహితుడైన సమాచార శాఖ మంత్రి పేర్ని నాని ఈ విషయంలో బరిలోకి దిగారు
పార్టీకి చెందిన కొంతమంది ఎమ్మెల్యేలు తన దయా దాక్షిణ్యాలపైనే గెలిచారు అంటూ ఆయన వ్యాఖ్యానించడంపై పేర్ని నాని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రఘురామకృష్ణంరాజు సొంతంగా గెలిచే అంతా పోటుగాడు అయితే, అన్ని పార్టీలు ఎందుకు మారాల్సి వచ్చింది అనే విషయంపై సమాధానం చెప్పాలంటూ డిమాండ్ చేశారు. 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి, ఆ తర్వాత టిడిపి అధినేత చంద్రబాబు తో చర్చలు జరిపి బీజేపీ కండువా కప్పుకున్నారు అంటూ నాని మండిపడ్డారు. సొంతంగా గెలిచే సత్తా ఉంటే మూడు పార్టీలు ఎందుకు మారాల్సి వచ్చిందని, సొంతంగానే పార్టీ పెట్టి పోటీ చేస్తే సరిపోయేది కదా అని సలహా ఇచ్చారు. పార్టీ మారిపోయి బిజెపిలో చేరటానికి సిద్ధపడ్డ రఘురామ కృష్ణం రాజును వూరికినే వదలిపెట్టరాదని వైసీపీ అగ్ర నాయకత్వం నిర్ణయించినట్లు కూడా విశ్వసనీయ వర్గాల సమాచారం.రోజుకొకరుగా జగన్ సన్నిహితులు రఘురామ కృష్ణంరాజు పై దుమ్మెత్తి పోస్తారని కూడా ఆ వర్గాలు చెప్పాయి.