రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారంలో వైకాపా నేతలు మొదటినుంచీ అనుమానాలు వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో స్వయంగా ముఖ్యమంత్రే కల్పించుకుని విమర్శలు చేశారు.. తమకు నమ్మకం లేదని క్లారిటీ ఇచ్చారు! నిమ్మగడ్డ రమేష్ కుమార్.. చంద్రబాబుకు సన్నిహితుడని, చంద్రబాబు సన్నిహితులకు మరీ సన్నిహితుడని విమర్శలు వచ్చాయి. అయితే గతంలో వాటిని రాజకీయ విమర్శల్లో భాగంగానే చూశారు కొందరు! మరీ.. రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తిపై కూడా ఇలాంటి విమర్శలు ఏమిటి అని ఖండించిన వారూ లేకపోలేదు! దీంతో కోర్టులను ఆశ్రయించడం, అనంతరం దెబ్బలు తినడం ఏపీ సర్కార్ వంతైంది! కానీ… నిజం నిలకడమీద తెలిసింది!!
అకస్మాత్తుగా నిమ్మగడ్డ రమేష్ కుమార్.. చంద్రబాబుకు అత్యంత సన్నిహితులైన సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్ రావు తో హైదరాబాదులోని పార్క్ హయత్ హోటల్లో భేటీ అవ్వడం, ఆ భేటీకి సంబంధించి ఫుటేజ్ బయటికి రావడం, ఈ వ్యవహారంపై అటు మీడియాలోనూ, ఇటు సోషల్ మీడియాలోనూ పెద్ద ఎత్తున కథనాలు రావడంతో.. నాడు జగన్ సర్కార్ చేసిన ఆరోపణల్లో ఎంతోకొంత వాస్తవం ఉందని.. నాటి వారి ఆవేదనలో నిజముందని.. నిమ్మగడ్డ వ్యవహారం కాస్త అనుమానంగానే ఉందని.. అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఏమాటకామాట చెప్పుకోవాలంటే… ఈ వ్యవహారం బయటకు వచ్చి ఉండకపోతే.. ఈ ఒక్క విషయంలో జగన్ మాటలు ఎవరూ పూర్తిగా నమ్మిఉండేవారు కాకపోవచ్చు! ఈ విషయంలో నిమ్మగడ్డ మౌన పోరాటం రేంజ్ లో నడవడిక, దానికి టీడీపీ నేతల తోడు, బీజేపీలో ఉండే బాబు ఫ్యాన్స్ తోడ్పాటు, టీడీపీ అనుకూల పత్రిల మద్దతు.. అన్నీ కలిపి ఈ ఒక్క పేరుచెప్పి ఏపీ ప్రభుత్వానికి చేయాల్సిన డ్యామేజ్ అంతా చేసేశారని కథనాలు వచ్చాయి. హైకోర్టు మొట్టికాయలు వేయడం, అనంతరం సుప్రీం వరకూ వ్యవహారం వెళ్లడం తెలిసిందే. ఈ క్రమంలో… నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారం వెలుగులోకి రావడంతో.. ఈ వ్యవహారం రసవత్తరంగా మారింది. నెక్స్ట్ స్టెప్ ఏమిటి?
ఈ విషయంలో మైకందుకున్న అంబటి రాంబాబు.. నిమ్మగడ్డను అరెస్టు చేయాలనేస్థాయిలో డిమాండ్ చేస్తున్నారు. రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి ఇలాంటి చిల్లర రాజకీయాలు చేయడం, ఒక రాజకీయ పార్టీ చేతిలో పావుగా మారడం పై కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని మరికొందరు డిమాండ్ చేస్తున్నారు. ఆ సంగతులు అలా ఉంటే… జగన్ ఎలా ఆలోచిస్తున్నారు? నిమ్మగడ్డ విషయంంలో తన వాదన, ఆవేదనా నిజమని తెలిసిన తరుణంలో, జగన్ నెక్స్ట్ స్టెప్ ఏమిటి?
ఈ విషయంలో జగన్.. తనవైపు నుంచి ఎలాంటి నెక్స్ట్ స్టెప్ తీసుకోరనే అంటున్నారు విశ్లేషకులు! మిగిలిన అందరికంటే అన్నింటికంటే జగన్ కు కావాల్సింది జనాలు, వారి అభిప్రాయాలు! కాబట్టి… నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయంలో తన ఆవేదనలో నిజముందని, తన వేదనలో వాస్తవం ఉందని ప్రజలు ఇప్పటికే గ్రహించేశారు. కాబట్టి జగన్ కు ఇంక నిమ్మగడ్డ వ్యవహారంతో పని అయిపోయినట్లే.. ప్రజలకు క్లారిటీ ఇచ్చేసినట్లే! కాకపోతే చట్టం తనపని తానుచేసుకుపోతుందిగా!!