మళ్ళీ కాపు రిజర్వేషన్ల అంశం తెర మీద కొచ్చింది.మొన్న జనసేన అధినేత పవన్ కలిగాడు ఈ అంశం గురించి లేవనెత్తితే వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో కౌంటర్ ఇచ్చిన విషయం తెలిసిందే.
ఆ సమయంలో వారు కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభాన్ని కూడా సమర్థిస్తూ మాట్లాడారు.కాపు రిజర్వేషన్ల సాధన కోసం పోరాడిన ముద్రగడ పద్మనాభాన్ని తెలుగుదేశం ప్రభుత్వం తీవ్రంగా హింసించిందని వైసిపి నేతలు పేర్కొన్నారు.అయితే ఇప్పుడు అదే ముద్రగడ పద్మనాభం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కాపు రిజర్వేషన్లపై లేఖ రాయడం రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది.
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు కాపు రిజర్వేషన్ల పోరాట సమితి నేత ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. కాపు రిజర్వేషన్లను అమలు చేయాలని ముద్రగడ ఆ లేఖలో కోరారు. నవీన్ పట్నాయక్, జ్యోతి బసు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి లాగే మీరూ పూజలందుకోవాలని కోరుకుంటున్నానని,ముఖ్యమంత్రి పదవిని మూణ్ణాళ్ల ముచ్చట చేసుకోవద్దని తన లేఖలో జగన్ ని ముద్రగడ పద్మనాభం కోరారు. ప్రధాని నరేంద్ర మోదీ తో మాట్లాడి కాపు రిజర్వేషన్లపై తేల్చాలని ఆయన లేఖలో కోరారు. మీరు అడిగిన వారికి, అడగని వారికి దానాలు చేసి దానకర్ణుడు అనిపించుకుంటున్నారని, రిజర్వేషన్ల సమస్యను కూడా తీర్చమని అభ్యర్థించారు. గతంలో కాపు రిజర్వేషన్ల పోరాటానికి మద్దతు ఇచ్చిన విషయాన్ని ముద్రగడ పద్మనాభం గుర్తు చేశారు. మీ విజయంలో మా జాతి పాత్ర ఉందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు.ముద్రగడ పద్మనాభం తాజా లేఖతో వైసిపి కాపుల లెక్కలు తప్పుతున్నాయని ఆయన స్వతంత్రంగానే వ్యవహరిస్తున్నారు తప్ప
ఏ పార్టీకి అనుకూల వైఖరి అవలంబించటం లేదని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.మరి ముద్రగడ లేఖపై వైసీపీ ఏ విధంగా స్పందిస్తుందన్నది చూడాల్సి ఉంది !