స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాదం కేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ కేసుకు సంబంధించి రమేష్ ఆస్పత్రి యాజమాన్యానికి, బంధువులకు నోటీసులు జారీ చేశారు.
సెక్షన్ 160 సీఆర్పీసీ కింద పదిమందికి నోటీసులు అందచేశారు. వీరంతా విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. కాగా స్వర్ణ ప్యాలెస్లో ఏర్పాటు చేసిన కోవిడ్ ఆస్పత్రి నిర్వహణలో నిర్లక్ష్యం వహించి 10మంది మృతి చెందడానికి కారణమైన ఘటనలో ఇప్పటికే ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక పరారీలో ఉన్న రమేష్ ఆసుపత్రి చైర్మన్ రమేష్ బాబు, స్వర్ణ ప్యాలెస్ యజమాని శ్రీనివాస్ బాబుకోసం ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు.
ఇక ఈ కేసులో ఇప్పటి వరకు పోలీసులు జరిపిన దర్యాప్తులో అనేక ఆసక్తికరమైన అంశాలు వెలుగుచూశాయి. కరోనాని క్యాష్ చేసుకునేందుకు ఈ కార్పొరేట్ ఆసుపత్రి పెద్ద ఎత్తునే తెరవెనుక ఏర్పాట్లు చేసుకున్నట్లు ఇప్పుడు బయటకి వస్తోంది. కరోనా రోగుల నుండి ఎంత వసూలు చేయాలన్న ఈ విషయమై విజయవాడలోని కార్పొరేట్ ఆస్పత్రులు నెల క్రితమే ఒక ఆంతరంగిక సమావేశాన్ని నిర్వహించుకొన్నాయి.ఇందులో ప్రముఖ వైద్యుడు చేసిన తక్కువ ఫీజుల ప్రతిపాదనలను విన్న సీనియర్ డాక్టర్లు అభ్యంతరాలు వ్యక్తం చేశారు.
రోజుకు రూ.10 వేల నుంచి రూ.15 వేల కంటే ఎక్కువ ఛార్జీ వద్దన్న ఆయన అభిప్రాయాలకు మద్దతు లభించలేదు. హెల్ప్లైన్ ఏర్పాటు చేసి ప్రజలకు వైద్య సలహాలు ఇద్దామన్న ఆయన ప్రతిపాదనను కూడా తోసిపుచ్చడం కార్పొరేట్ ఆస్పత్రుల ధనదాహానికి నిదర్శనం.రమేష్ఆస్పత్రితోపాటు ఒక్కో కార్పొరేట్ ఆస్పత్రి ఒక్కో రకంగా కరోనాకు ఫీజులు వసూళ్లు చేస్తున్నాయి. పది రోజులకు రూ. 5 లక్షలు, ఏడు రోజులకు రూ.4 లక్షలు, ఐదు రోజులకు రూ.3 లక్షలు చొప్పున నిర్ణయించాయి. బీమా క్లెయిమ్ చేసుకుంటామని రశీదులు ఇవ్వాలని రోగులు అడిగినా ఆస్పత్రులు ఇవ్వడం లేదు. కోవిడ్ పేషెంట్ల వద్దకు బంధుమిత్రులు ఎవరూ రాకపోవడం, వచ్చినా అనుమతించకపోవడం ఆస్పత్రి వర్గాలకు అనుకూలమైంది. క్వారంటైన్లో ఉండే వారే దఫదఫాలుగా డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా బిల్లులు చెల్లించాల్సి వచ్చింది.
ఆర్థికంగా స్థితిమంతులను ఎంపిక చేసుకుని మరీ కోవిడ్ కేర్ సెంటర్లలో చేర్చుకున్నారు. ఇందుకు సహకరించిన ఆర్ఎంపీలు, దళారులకు కొంత చెల్లించారని నిఘా వర్గాలు, పరిశీలన బృందాలు గుర్తించాయి. కొసమెరుపేమిటంటే రమేష్ హాస్పిటల్స్ స్వర్ణ ప్యాలెస్ హోటల్లో నిర్వహించిన కోవిడ్ కేర్ సెంటర్ లో అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఉన్న 30 మంది రోగుల్లో 26 మంది కరోనా నెగిటివ్ వారే.
అవసరం లేనప్పటికీ వారి నుండి డబ్బు పిండాలనే ఆశతో రమేష్ హాస్పిటల్స్ యాజమాన్యం వీరిని ఆ కోవిడ్ కేర్ సెంటర్ లో ఉంచి ప్రమాదానికి గురి చేసినట్లు ఇప్పుడు వెలుగుచూసింది. ప్రభుత్వానికి మచ్చ తెచ్చిన ఈ సంఘటనపై చాలా సీరియస్ అయిన సీఎం సదరు కార్పొరేటర్ హాస్పిటల్ పై కఠిన చర్యలకు ఆదేశించారని ఉన్నత స్థాయి అధికార వర్గాలు తెలిపాయి