YS Viveka Murder Case: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన ఒక కీలక ప్రకటన శాసన సభలో చంద్రబాబునాయుడు ఎపిసోడ్ మధ్యలో మరుగున పడిపోయింది.మామూలుగా అయితే తన బాబాయ్ వివేకానందరెడ్డి హత్యపై సీఎం చేసిన ఆ ప్రకటన మీడియాలో ప్రధాన వార్తగా మారేది.అయితే వ్యూహత్మకంగానే జగన్ ఆ గొడవలోనే వివేకా హత్యపై తాను చెప్పాల్సింది చెప్పేసి చేతులు దులిపేసుకున్నారని పరిశీలకులు భావిస్తున్నారు.
ఈ హత్య కేసులో అప్రూవర్ గా మారిన వివేకానందరెడ్డి డ్రైవర్ దస్తగిరి సిబిఐ కి ఇచ్చిన నేర అంగీకార పత్రం ప్రకారం కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డితో సహా నలుగురు ఈ హత్యకు కారకులని వెల్లడించడం తెలిసిందే.ఆ నలుగురిలో ఒకరైన వైసిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివశంకర్ రెడ్డి ని ఇప్పటికే సీబీఐ అరెస్ట్ చేయడం కూడా విదితమే.ఇవాళో రేపో కడప ఎంపీ అవినాష్ రెడ్డిని కూడా అరెస్టు చేయబోతున్నారన్న వార్తలు వస్తున్న తరుణంలో సీఎం జగన్ ఆయనకు అసెంబ్లీ సాక్షిగా క్లీన్ చిట్ ఇచ్చేశారు.ఇది ఈ కేసును మలుపుతిప్పే మరో అంశం.
YS Viveka Murder Case: జగన్ చెప్పిందేమిటంటే?
“వివేకానందరెడ్డి నా బాబాయ్.అవినాష్ రెడ్డి నా ఇంకో బాబాయ్ కొడుకు.అతడు ఎందుకు తనకు కూడా బాబాయ్ అయిన వివేకానందరెడ్డిని చంపుతాడు?ఎవరైనా తన కంట్లో తనే పొడుచుకుంటారా”అని జగన్ తనదైన శైలిలో అసెంబ్లీలో వివేకా హత్యపై స్పందించారు.తద్వారా అవినాశ్ రెడ్డి కి ఆయన ఉత్తమ కాండక్ట్ సర్టిఫికెట్ ఇచ్చినట్లయింది.అంతేగాకుండా బాబాయ్ హత్య విషయంలో జగన్ మోహన్ రెడ్డి వైఖరి ఏమిటో కూడా చెప్పకనే చెప్పినట్లయింది.
టిడిపి చేయించి ఉండొచ్చు కదా?
అంతటితో ఆగకుండా జగన్ మోహన్ రెడ్డి ఈ హత్యను టిడిపికి రుద్దే ప్రయత్నం కూడా చేశారు .అప్పట్లో అధికారంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వమే ఈ హత్య చేయించి ఉండొచ్చు కదా అని కూడా ఆయన అనుమానం వ్యక్తం చేశారు. వివేకానందరెడ్డిని ఎమ్మెల్సీగా ఓడగొట్టేందుకు అప్పట్లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు అరాచకాలకు పాల్పడ్డాడని సీఎం జగన్ తెలిపారు.ఇప్పుడు వైసీపీని బద్నాం చేసేందుకు వివేకానందరెడ్డి హత్య కేసు ను వక్రీకరిస్తూ వైసిపి నేతలకు ఆపాదించే ప్రయత్నాలను టిడిపి నాయకులు చేస్తున్నారన్నారు.అయితే పైన దేవుడున్నాడని, అన్నీ చూస్తున్నాడని,ఎవర్ని ఏంచేయాలన్నా ఆయనే చేస్తాడని ముఖ్యమంత్రి ముక్తాయింపు ఇచ్చారు.సీఎం ప్రసంగం లో టీడీపీపై ఆరోపణలు రొటీనే కానీ ఎంపీ అవినాశ్ రెడ్డి కి సమర్ధన మాత్రం అండర్ లైన్ చేయాల్సిన అంశం.