తన క్యాబినెట్ లో ఇద్దరు ముగ్గురు మంత్రులు ప్రతిపక్షాల ట్రాప్లో ఇరుక్కొని వారి విమర్శలకు అతిగా స్పందిస్తూ తన ప్రభుత్వానికి ,వైసీపీ పార్టీకి ఇబ్బందులు చేస్తున్నారని ముఖ్యమంత్రి జగన్ అసహనం తో ఉన్నారని సమాచారం.
సాధారణంగా ప్రతిపక్షాలు ఎప్పుడూ అధికార పార్టీ మంత్రులు ఎమ్మెల్యేలను టార్గెట్ చేసి ఆరోపణలు చేస్తుంటాయి.విమర్శనాస్త్రాలు సంధిస్తుంటాయి. అలాంటి సమయంలోనే అధికారపార్టీ మంత్రులు ప్రజాప్రతినిధులు సంయమనం పాటించాలి .సమయస్ఫూర్తి ప్రదర్శించాలి. జగన్ మంత్రివర్గంలో ఉన్న చాలా మంది ఇదే ఫార్ములా అనుసరిస్తున్నారు.వైసీపీలో చాలా మంది మంత్రులు ప్రత్యర్థులు ఏమన్నా.. తమ పనితాము చేసుకుని పోతున్నారు. మంత్రులు మేకపాటి గౌతం రెడ్డి ,తానేటి వనిత , అంజాద్ బాషా , ఆళ్లనాని వంటివారు.. ప్రత్యర్థులు విసిరే బాణాలకు అవకాశం ఇవ్వకుండా.. తమ పని తాము చేసుకుపోతున్నారు. ఇక ధర్మాన కృష్ణదాస్, కన్నబాబు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి , సుచరిత వంటివారు ప్రత్యర్థుల ట్రాప్లో పడకుండా కౌంటర్లు ఇస్తూ ఇబ్బందిలేని విధంగా ముందుకు సాగుతున్నారు.
అయితే ఒకరిద్దరు మంత్రులు మాత్రం ప్రత్యర్థులు విసిరే ట్రాప్లో సునాయాసంగా చిక్కుకుపోతున్నారు. ఫలితంగా వారు అభాసుపాలవడంతోపాటు పార్టీని ప్రభుత్వాన్ని కూడా ఇరకాటంలోకి నెడుతున్నారు. వీరిలో మంత్రి కొడాలి నాని ముందువరుసలో ఉండగా,బొత్స సత్యనారాయణ ,నారాయణ స్వామి వంటివారు తరువాతి స్థానాల్లో ఉన్నారు.ముఖ్యంగా కొడాలి నాని వైఖరి పార్టీకి ప్రభుత్వానికి చాలా ఇబ్బందికర పరిస్థితి సృష్టిస్తోంది.దేవాలయాలపై దాడులు జరిగిన నేపథ్యంలో మంత్రి కొడాలి నాని స్పందించిన తీరును ఎవరూ సమర్థించలేని పరిస్థితి నెలకొంది .రాజధాని ,అమరావతి విషయాల మీద మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు కూడా వివాదాస్పదమయ్యాయి. మద్యం ధరల మీద ఎక్సైజ్ మంత్రి నారాయణ స్వామి స్పందించిన తీరు ప్రతిపక్షాలకు అస్త్రాలను ఇచ్చింది.
ప్రత్యర్థి పార్టీలు రెచ్చగొడుతుండడంతో ఒకింత సంయమనం కోల్పోయి వీరు నోరు జారుతున్నారు.ఇది అంతిమంగా వారిపై విమర్శలకు అవకాశం ఇవ్వడంతోపాటు.. ప్రభుత్వం వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. దీన్ని గమనించిన ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి సదరు మంత్రులపై ఆగ్రహంతో ఉన్నారట. సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ కూడా ప్రతిపక్షాల ట్రాప్ లో పడడం ఆయన కి ఆశ్చర్యం కలిగిస్తోంది.ఇక కొడాలి నాని పరిధులు దాటి ప్రవర్తిస్తున్నారన్న నిర్ణయానికి జగన్ వచ్చారట.నారాయణ స్వామిది అనుభవ లేమి అని ఆయన భావిస్తున్నారట.ఈ నేపథ్యంలో ఆ మంత్రులందరికీ జగన్ క్లాస్ తీసుకున్నారని ఇకనైనా ప్రతిపక్షాల వలలో చిక్కుకోవద్దని తలంటి పోశారని వైసీపీ వర్గాలు చెప్తున్నాయి.