నారా చంద్రబాబు నాయుడు…. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు. 40 ఇయర్స్ ఇండస్ట్రీ, దేశంలోనే అందరి కంటే సీనియర్ నేనే అని సందర్భం దొరికినప్పడల్లా చెప్పుకొనే నేత.
అలాంటి సీనియర్ నాయకుడు గత సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేతిలో ఘోర పరాజయం పాలయ్యారు. రికార్డు స్థాయి ఓటమిని టీడీపీ ఖాతాలో చేర్చారు. మరోవైపు వైసీపీ ఘన విజయం సాధించిన తర్వాత కూడా తెలుగుదేశం పార్టీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. పార్టీలో ఉన్న సీనియర్ నేతలు వైసీపీ గూటికి చేరుతూనే ఉన్నారు. ఈ పరంపరలో మరో షాక్ తగిలింది. విశాఖ దక్షిణ నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసి గెలిచిన వాసుపల్లి గణేష్… ఇవాళ సీఎం జగన్తో భేటీ కాబోతున్నారు.
చంద్రబాబుకు షాక్ ?
గత ఎన్నికల్లో టీడీపీ తరపున విశాఖ దక్షిణ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచిన వాసుపల్లి గణేష్…కొన్నాళ్లుగా టీడీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. విశాఖను పరిపాలన రాజధానిగా ప్రకటించిన తర్వాత వాసుపల్లి గణేష్ ఇలా మౌనం వహించడం ఆసక్తికర అంశం. వైసీపీ గూటికి చేరాలని నిర్ణయించుకోవడం వల్లే ఆయన పార్టీతో అంటీముట్టనట్లు ఉన్నారని విశాఖ టీడీపీలో చర్చ జరుగుతోంది. ఇలాంటి సమయంలో గణేష్ మనసు మార్చేందుకు టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు అన్ని ప్రయత్నాలు చేశారు. అయినా ఫలితం లేకుండా పోయింది. ఇవాళ సీఎం జగన్తో వాసుపల్లి గణేష్ భేటీ కాబోతున్నారు.
వారి బాటలోనే….
తెలుగుదేశం పార్టీకి గత ఎన్నికల్లో ఘోర పరాజయం నుంచి అనేక షాకులు తగులుతూనే ఉన్నాయి. సీనియర్ నేతలు, టీడీపీ ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, కరణం బలరాం, మద్దాలి గిరి సైకిల్ పార్టీకి బైబై చెప్పేశారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మద్దతు ప్రకటించారు. అయితే, వివిధ కారణాల వల్ల వైసీపీలో అధికారికంగా చేరకుండా ఆ పార్టీకి మద్దతి తెలిపారు. ఇలా టీడీపీ తరఫున గెలిచిన సిట్టింగ్ ఎమ్మెల్యేలు వైసీపీ కండువా కప్పుకోకుండా ఆ పార్టీకి మద్దతిస్తుండటం టీడీపీ శ్రేణులను ఇప్పటికే కలవరపాటుకు గురి చేస్తోంది. అదే ఒరవడి మరో టీడీపీ ఎమ్మెల్యే పార్టీకి గుడ్బై చెప్తుండటం, వైసీపీ కండువా వేసుకోకుండా అనుబంధ సభ్యుడిగా కొనసాగే యోచనలో ఉండటం సహజంగానే టీడీపీ నేతలకు షాక్.
టీడీపీని చంద్రబాబు వదిలేశారా?
కీలకమైన విశాఖలో సీనియర్ నేత, ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ ముఖ్యమంత్రి జగన్తో భేటీ అవడం,
వైసీపీ కండువా కప్పుకోకుండానే ఆ పార్టీకి మద్దతిస్తారనే వార్తల నేపథ్యంలో టీడీపీ పెద్దలు ఏం చేస్తున్నారనే చర్చ జరుగుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై విమర్శలు చేయడం తప్ప పార్టీ బలోపేతం, పార్టీ నాయకుల్లో భరోసా నింపడంలో అధినాయకత్వం విఫలం అయినందునే ఇలాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని పలువురు పేర్కొంటున్నారు. పార్టీ కార్యక్రమాల కంటే, ప్రతిపక్ష పాత్ర కంటే విమర్శలకు ప్రాధాన్యం ఇచ్చినందుకే ఈ పరిస్థితి అంటూ ఇంకొందరు వాపోతున్నారు.