వైసీపీలో ఒక్కసారిగా లేచిన దాదాపు పది అసమ్మతి గళాల విషయంలో జగన్ తీవ్ర అసహనంతో ఉన్నారని పార్టీ ఉన్నత స్థాయి వర్గాలు చెప్పాయి.వారందరిపైనా త్వరలోనే చర్యలు ఉంటాయని కూడా ఆ వర్గాలు సూచనప్రాయంగా తెలిపాయి.నర్సాపురం ఎంపీ రఘు రామకృష్ణం రాజుతో పాటు,మాజీ మంత్రులు సీనియర్ ఎమ్మెల్యేలు మానుగుంట మహీధర్ రెడ్డి ఆనం రామనారాయణ రెడ్డి తదితరులు ఈ మధ్య ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.తర్వాత ఎమ్మెల్యేలు సర్దుకున్నప్పటికీ ఈలోపే వైసిపిలో ఏదో జరిగిపోతుందన్న సంకేతాలు ప్రజల్లోకి ,పార్టీ క్యాడర్ లోకి వెళ్లాయి.
ముఖ్యంగా నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పాటు ఆ జిల్లాకు చెందిన మరికొందరు ఎమ్మెల్యేల వ్యవహార శైలి జగన్ కి అసహనం కలిగిస్తోందని సమాచారం. ఈ మధ్య జరిగిన రాజ్యసభ ఎన్నికల సందర్భంగా ప్రతి జిల్లా నుండి ఎమ్మెల్యేలు వచ్చి ముఖ్యమంత్రినో,ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి నో కలిశారు.కాని నెల్లూరు జిల్లాకు చెందిన ఆనం రామనారాయణరెడ్డి, మరికొందరు ఎమ్మెల్యేలు వీరిని కలవలేదని,సజ్జల ఫోను చేసినా స్పందించలేదని పార్టీ వర్గాలు చెప్పాయి.
విషయం జగన్ వరకు వెళ్లిందని , వీరిపై తీవ్రస్థాయిలో అసహనం వ్యక్తం చేశారంటున్నారు.ముందుగా రఘురామకృష్ణం రాజుతో మొదలుపెట్టి తదుపరి వరుసగా అసమ్మతి గళం విప్పిన వారిపై చర్యలు తీసుకోవాలని జగన్ భావిస్తున్నారని వైసీపీ ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి.ముఖ్యమంత్రి జగన్ కఠన చర్యలు ఎలా ఉంటాయో త్వరలోనే స్క్రీన్ పై కనిపిస్తాయంటున్నారు.