సిపిఎస్ అనే సంస్థ ఇటీవల జగన్ ఏడాది పాలనపై నిర్వహించిన సర్వేలో వచ్చిన ఫలితాల్లో ఒకటి మాత్రం చాలా ఆసక్తికరంగా మారింది.జగన్ ఎంత చితక బాదుతున్నప్పటికీ తెలుగుదేశం పార్టీ ఇంకా బలంగానే ఉందని ఆ పార్టీ ఓట్ల శాతం ఏ మాత్రం తగ్గలేదని ఈ సర్వేలో వెల్లడైంది.2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి 38.5 శాతం ఓట్లు రాగా ఏడాది తరువాత ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా టిడిపికి 38.3 శాతం రాగలవని సర్వేలో తేలింది .
అంటే టిడిపి ఓటు బ్యాంకులో ఏ మాత్రం మార్పు లేదనే చెప్పాలి.టిడిపిని ఎంతగా టార్గెట్ చేసి జగన్ వైసీపీ ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టినా ఆ పార్టీకి ప్రజల్లో ఉన్న ఆదరణ అలాగే కొనసాగుతోందని అర్థం చేసుకోవాలా అని రాజకీయ పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.ఇక్కడ ఇంకో మతలబు కూడా ఉంది రెండు వేల పందొమ్మిది లో జగన్ కి 50 శాతం ఓట్లు రాగా ఇప్పుడది 56 కుపెరిగినట్లు సర్వే రిపోర్టులో వచ్చింది.అదే సమయంలో టిడిపి ఓట్ల శాతం తగ్గలేదు.గత అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన జనసేన వామపక్షాలు బీఎస్పీ కూటమికి ఆరు శాతం ఓట్లొచ్చాయి.ఇప్పుడు ఎన్నికలు జరిగి బిజెపి జనసేన కూటమిగా పోటీ చేసినా అన్ని ఓట్లు వస్తాయని సర్వే చెబుతోంది.మరి లెక్కలన్నీ అలాగే ఉంటే వైసిపికి పెరిగిన ఆరు శాతం ఓట్లు ఎక్కడనుంచి వచ్చాయన్నది ప్రశ్న.దీంతో ఈ సర్వే హేతుబద్ధత పై కూడా అనుమానాలు తలెత్తుతున్నాయి.
లేకపోతే ముఖ్యమంత్రిగా జగన్ పని తీరుకు 63శాతం మంది మద్దతు తెలిపారని సర్వే వెల్లడించింది.కానీ దేశంలో ఎక్కడా లేనివిధంగా అన్ని వర్గాలకు సంక్షేమ ఫలాలు అందిస్తున్న ముఖ్యమంత్రి జగన్ కు ఇంకా 37శాతం మంది వ్యతిరేకంగా ఉండటం కూడా ఇక్కడ గమనార్హం.అదే సమయంలో రాజధానిని అమరావతి నుండి విశాఖపట్నానికి మార్చేస్తున్న జగన్ ప్రభుత్వానికి ఆ ప్రాంతంలో 55 శాతం అనుకూల ఓట్లు వచ్చేయడం కూడా నమ్మశక్యమా అని రాజకీయ పరిశీలకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.ఇదేదో జగన్ ప్రభుత్వ అనుకూల సర్వే గానే వారు భావిస్తున్నారు.