అమరావతి: కత్తులు దూసుకోవడం కాదు, కరచాలనం చేసుకుంటూ పరస్పర సహకారంతో ముందుకు సాగాల్సిన అవసరం ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు అన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన కెసిఆర్ మాట్లాడుతూ నవ యువ ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు తెలంగాణ ప్రభుత్వం తరుపున అభినందనలు తెలియజేస్తున్నానని అన్నారు. ఇదొక ఉజ్వల ఘట్టంగా కెసిఆర్ అభివర్ణించారు. అనేక ప్రాంతాల్లో ఉన్న తెలుగు ప్రజలు పరస్పర సహకారంతో ముందుకు సాగటానికి ఈ ఘట్టం బీజం వేస్తుందని కెసిఆర్ అన్నారు.
‘జగన్ వయస్సు చిన్నది, బాధ్యత పెద్దది, శక్తి సామర్థ్యం, స్థైర్యం, ధైర్యం మీకుంది. గత తొమ్మిదేళ్లలో ప్రస్పుటంగా నిరూపించారు. గోదావరి, కృష్ణా జలాలను సద్వినియోగం చేసుకోవాలి. జగన్ మీ నాన్న పేరు నిలబెట్టాలి. ఒక్క సారి కాదు..మూడు నాలుగు సార్లు జగన్ రాష్ట్రాన్ని పాలించాలని దీవిస్తున్నాను’ అని కెసిఆర్ అన్నారు.