అమరావతి: కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి కడప జిల్లా పర్యటన షెడ్యూల్ రేపటికి వాయిదా పడింది. నేడు కడప జిల్లా పులివెందులకు వెళ్లి తండ్రి దివంగత సిఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ఘాట్ వద్ద నివాళులర్పించిన తరువాత తిరుమల వెళ్లాలని తొలుత జగన్ భావించారు. అయితే ముందుగా తిరుపతి వెళ్లి తిరుమల వెంకటేశ్వరస్వామివారిని దర్శించుకున్న తరువాత కడప పర్యటనకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. నేటి ఉదయం కడపకు బయలుదేరాల్సిన జగన్ తన కార్యక్రమాన్ని మార్చుకున్నారు. సాయంత్రం వరకూ తాడేపల్లిలో అధకారులతో సమావేశాలు, సమీక్షలు జరపనున్నారు.
సాయంత్రం ఐదు గంటలకు తాడేపల్లి నుండి జగన్ కుటుంబ సమేతంగా గన్నవరం విమానాశ్రయంకు వెళ్లి అక్కడ నుండి ప్రత్యేక విమానంలో రేణిగుంట చేరుకుంటారు. రాత్రి ఏడు గంటలకు తిరుమల చేరుకొని అక్కడే బస చేస్తారు. బుధవారం ఉదయం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అనంతరం రేణిగుంట చేరుకొని ప్రత్యేక విమానంలో కడపకు వెళతారు. కడప పెద్ద దర్గాలో ప్రార్థనల అనంతరం పులివెందుల వెళ్లి సిఎస్ఐ చర్చిలో ప్రార్థనలు చేస్తారు. ఆ తరువాత ఇడుపులపాయలో వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులర్పిస్తారు. అనంతరం కడపకు వెళ్లి ప్రత్యేక విమానంలో తిరుగు ప్రయాణం అవుతారు.