తిరుమల: రేపు నవ్యాంధ్రప్రదేశ్ రెండవ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న వైయస్ జగన్మోహన్ రెడ్డి కొద్ది సేపటి క్రితం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
నిన్న రాత్రికే తిరుమల చేరుకున్న వైయస్ జగన్ ఉదయం సాంప్రదాయ దుస్తుల్లో, తిరనామం ధరించి స్వామివారి దర్శనానికి వైకుంఠ ద్వారం వైపు వెళ్ళగా ఆలయ కార్యనిర్వహణ అధికారి అనిల్ కుమార్ సింఘాల్ , ఆలయ అర్చకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం గర్భగుడిలోకి వెళ్లి స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
టీటీడీ వేద పండితులు స్వామి వారి శేష వస్త్రాలతో జగన్ ను సత్కరించి ఆశీర్వచనాలు అందజేశారు.
జగన్ వెంట పార్టీ నేతలు విజయసాయిరెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, మిథున్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, ఆర్ కె రోజా, సామినేని ఉదయభాను తదితర ఎంపిలు, ఎమ్మెల్యేలు ఉన్నారు.
అనంతరం రేణుగుంట చేరుకొని ప్రత్యేక విమానంలో కడప బయలుదేరి వెళ్లారు.
పాదయాత్రకు ముందు కూడా జగన్ తిరుమల వెంకటేశ్వరస్వామిని దర్శించుకొని పూజలు నిర్వహించారు.