ఎప్పటికైనా ఏపీలో చక్రం తిప్పాలి.. ఏపీలో నిలదొక్కుకోవాలి.. దక్షిణాదిలో కూడా జెండా ఎగరేయాలని కలలు కంటుంటుంది బీజేపీ. అందులో భాగంగానే గత ఎన్నికల్లో టీడీపీతో కలిసి.. నిలిచి.. గెలిచి.. అధికారం కూడా పంచుకుంది. ఇటు రాష్ట్ర కేబినెట్ లో బీజేపీ మంత్రులు, అటు సెంట్రల్ కేబినెట్ లో టిడీపీ మంత్రులతో వ్యవహారం మూడు పువ్వులు, ఆరు కాయలుగా నడిచింది. కానీ…దానివల్ల ఏపీలో బీజేపీ ఎదగడానికో, ఎదిగిందని తృప్తిపడటానికో ఏమీ లేదు… బాబు మార్కు రాజకీయ ఫలితం!! ఆ సంగతులు అలా ఉంటే… ఇప్పుడు వైకాపా దోస్తీ కోరుకుంటుంది బీజేపీ!
ప్రస్తుతం ఇప్పట్లో ఏపీలో ఎదురులేని శక్తిగా వైకాపా మారుతున్న సమయంలో… వారితో స్నేహం ముందు.. ఆముందు.. ఆపైముందు.. దేనికైనా అక్కరకు రావొచ్చని ప్లాన్స్ వేస్తోంది బీజేపీ. ఇందులో భాగంగా స్థానికంగా బలపడటానికి రాష్ట్రస్థాయి నేతలతో విమర్శలు గుప్పిస్తూనే… మరోపక్క కేంద్రంలో కేబినెట్ లో వైకాపాను కలుపుకోవాలని మోడీ భావిస్తోన్న సంగతి తెలిసిందే. ముందు ఒక మంత్రి పదవి, ఒక సహాయ మంత్రి పదవి అన్న వార్తలు వచ్చిన సంగతి కూడా తెలిసిందే.
అయితే… జగన్ ఈ విషయంలో ఏమాత్రం ఆసక్తి చూపడం లేదని తెలిసిందే. అందులో భాగంగానో ఏమో కానీ… ఒక సహాయమంత్రి కాస్తా.. ఇప్పుడు రెండు సహాయమంత్రి పదవులుగా మారింది!! అయినా కూడా జగన్ అంగీకరించే ఆలోచనలు లేవని తెలుస్తోంది. దానికి కారణం ప్రధానగా ఒకటే ఒకటి… రాజకీయ పార్టీగా బీజేపీ సిధ్ధాంతాలు వేరు, జగన్ రాజకీయ సైద్ధాంతిక పునాది వేరు. ఈ ఒక్కకారణం చాలు… మోడీ ఎంత ఒత్తిడి తెచ్చినా కూడా నో చెప్పడానికి అని అంటున్నారు విశ్లేషకులు!