బీసీలపై అతి నమ్మకం పెట్టుకుని ఓసీలను దూరం చేసుకుంటున్న వైసిపి అధినేత ముఖ్యమంత్రి జగన్ రాజకీయ రాజకీయ వ్యూహం భవిష్యత్తులో వికటించగలదని పరిశీలకులు హెచ్చరిస్తున్నారు.
మొన్నటి ఎన్నికల్లో వైసీపీ కి 151 సీట్లు వచ్చాయి అంటే అన్ని వర్గాలు ఆ పార్టీని ఆదరించాయని అర్థం.ఇందులో బీసీలు కూడా ఉండొచ్చు కానీ వారి వల్లనే వైసిపి ఇంత ఘనవిజయం సాధించిందని భావించడం కరెక్టు కాదని వారంటున్నారు.కానీ ఎందుకనో ముఖ్యమంత్రి జగన్ బిసిల జపం ప్రారంభించారు.వారికి అత్యధిక ప్రాధాన్యమిస్తున్నారు.రాష్ట్రం నుంచి రెండు రాజ్యసభ స్థానాలను బీసీలైన పిల్లి సుభాష్ చంద్రబోస్ మోపిదేవి వెంకటరమణలకు ఆయన ఇచ్చారు.వారి స్థానాల్లో బీసీలనే మంత్రులుగా కూడా తీసుకున్నారు.
కానీ రాష్ట్ర రాజకీయాలను ఒకసారి విశ్లేషిస్తే ఔనన్నా కాదన్నా బీసీలు టిడిపికి కంచుకోట.మొన్నటి ఎన్నికల్లో ప్రత్యేక పరిస్థితుల్లో జగన్ ఇచ్చిన ఒక్క ఛాన్స్ నినాదంతో వారు కూడా ఆయన వైపు మొగ్గు చూపారు తప్ప పూర్తిగా వైసీపీ వైపు తిరిగి పోలేదు.కానీ జగన్ మాత్రం బీసీలంతా వైసీపీలోకి వచ్చేశారు అన్న భ్రమలో ఉన్నారంటున్నారు.జగన్ ప్రభుత్వం పదవులు ఇవ్వాలంటే బీసీలే కొలమానంగా పెట్టుకుంటోంది. జగన్ లెక్కలు వేరు. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు కలుపుకుంటే బాహుబలిగా వైసీపీ మారుతుందని అంచనా వేస్తున్నారట .నిజానికి కాంగ్రెస్ పార్టీకి అగ్రకులాలు, ప్రత్యేకించి రెడ్లు పూర్తి అండగా నిలబడతారు.
గతంలో వైఎస్ రాజశేఖర్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా రెడ్లకు టాప్ ప్రియారిటీ ఇచ్చేవారు.కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా తిరగబడింది. జగన్ రెడ్ల ని దగ్గరకు రానివ్వడం లేదని ఆ సామాజిక వర్గంలో అసమ్మతి రగులుతోంది.బీసీలను అంతగా నమ్మటం మంచిది కాదని వైసిపి వర్గాలు గొనుకుంటున్నాయి.బీసీల ఓటు బ్యాంక్ ఎపుడూ టీడీపీకి పెట్టని కోటే. ఒకే ఒక ఎన్నిక అదీ 2019లోనే వైసీపీ వైపుగా ర్యాలీ అయింది. దానికి అనేక కారణాలు ఉన్నాయి. బాబు ఆ అయిదేళ్లూ కాపులను బీసీల్లో చేరుస్తామని లేనిపోని హామీలు గుప్పించి వారి జపం చేశారు. బీసీలు ఎటూ తమవైపే కదా అని కడు ధీమా ప్రదర్శించారు. దాంతోనే వారంతా బాబుని వదిలి వైసీపీ వైపు చూశారు. అలా టీడీపీ పెట్టాక తొలిసారి వారు పసుపు పార్టీకి దెబ్బకొట్టారు. 2024 ఎన్నికలకు ఆ పరిస్థితి ఉంటుందా? అంటే చెప్పలేమనే అంటున్నారు.
బీసీలు గుత్తమొత్తంగా వైసీపీకి ఓటు వేసే సీన్ ఉండకపోవచ్చు. మరి వారినే నమ్ముకుని ఓసీలను, తనను వైఎస్సార్ ని దశాబ్దాల తరబడి అట్టిపెట్టుకుని ఉన్న రెడ్లను, ఇతర అగ్ర కులాలను జగన్ కనుక దూరం చేసుకుంటే రాజకీయంగా గట్టి షాకులు తగులుతాయి అన్న విశ్లేషణలు ఉన్నాయి. అయితే జగన్ తో ఉన్న సమస్యేమిటంటే ఆయన అనుకున్నది చేస్తారు తప్ప అందరి అభిప్రాయాలు తీసుకోరు.కాని సుదీర్ఘకాలం అధికారం లో ఉండాలంటే జగన్ బిసిలనే కాకుండా అన్ని వర్గాలను కూడా అక్కున చేర్చుకోవడం ఎంతైనా అవసరమని రాజకీయ పరిశీలకులు సలహా ఇస్తున్నారు.