రాష్ట్ర ముఖ్యమంత్రిగా..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు వైఎస్ రాజశేఖర రెడ్డి. సీఎంగా ఆయన పనిచేసిన అయిదేళ్ల మూడు నెలల కాలంలో అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు ఆయన్ను ప్రజల గుండెల్లో నిలిచిపోయేలా చేశాయి. ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్, రైతులకు ఉచిత విద్యుత్ లాంటి ఎన్నో ప్రజాకర్షక పథకాలు ప్రజలకు లబ్ది చేకూర్చాయి. 2009 ఎన్నికల్లోనూ వైఎస్సార్ నాయకత్వంలోనే కాంగ్రెస్ మెజార్టీ స్థానాలు దక్కించుకుని అధికారంలోకి వచ్చింది. దీంతో వైఎస్ రెండోసారి సీఎం అయ్యారు. అయితే, సీఎం అయిన కేవలం మూడు నెలలకే సెప్టెంబర్ 2న చిత్తూరు జిల్లాలో రచ్చబండ కార్యక్రమానికి వెళ్తూ హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. వైఎస్ హయాంలో అమలు చేసిన అనేక సంక్షేమ పథకాలు నేటికీ అమలవుతున్నాయి.
పాదయాత్ర ఓ సంచలనం..
ప్రతిపక్ష నేతగా ఆయన చేపట్టిన పాదయాత్ర ఓ సంచలనం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 1,467 కిలోమీటర్లు నడిచి ప్రజా సమస్యలు తెలుసుకున్నారు. రైతుల ఇబ్బందులు, పేద విద్యార్థుల సమస్యలు చూసి చలించిపోయారు. సీఎంగా అధికారంలోకి వచ్చిన తర్వాత వారి కోసం ప్రవేశపెట్టిన పథకాలు చరిత్రలో నిలిచిపోయాయి.
రాజకీయ నాయకుడిగా..
రాజకీయంగానూ ఎదురులేని నాయకుడిగా నిలిచారు వైఎస్. తొలిసారి 1978 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పులివెందుల నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఇక్కడి నుంచే మొత్తం 6 సార్లు ఎమ్మెల్యేగా, కడప లోక్సభ నుంచి నాలుగు సార్లు ఎంపీగా గెలుపొందారు. పోటీ చేసిన ప్రతి ఎన్నికల్లోనూ విజయం సాధించి ఓటమెరుగని నాయకుడిగా నిలిచారు. 1980–82 మధ్య కాలంలో గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా, 1982లో ఎక్సైజ్ మంత్రిగా, 1982–83 మధ్య కాలంలో విద్యా శాఖ మంత్రిగా సేవలందించారు. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చి సంచలనాలు సృష్టించినా పులివెందులలో వైఎస్సార్ హవాను తగ్గించలేకపోయారు. అందుకే వైఎస్సార్ను అభిమానులు ‘పులివెందుల పులి’గా పిలుచుకుంటారు.
వైఎస్ కు సవాల్ విసిరిన ఎన్నికలు..
వైఎస్సార్కు అసలైన సవాల్ విసిరింది 1996 ఎన్నికలే. ఆ ఎన్నికల్లో వైఎస్సార్ కేవలం 5,435 సాధించారు. చిరకాల ప్రత్యర్థి కందుల రాజమోహన్రెడ్డి వైఎస్సార్ను ఓడించినంత పని చేశారు. ఆ ఎన్నికల్లో వైఎస్ కు 368,611 ఓట్లు రాగా.. కందుల రాజమోహన్ రెడ్డి 363,166 ఓట్లు సాధించారు. ఆ ఎన్నికల్లో స్వల్ప మెజారిటీతో గట్టెక్కిన వైఎస్.. తర్వాతి ఎన్నికల్లో 50 వేలు పైచిలుకు మెజారిటీ సాధించారు.
పీసీసీ అధ్యక్షుడిగా..
ఏపీసీసీ అధ్యక్షుడిగా వైఎస్ రెండు సార్లు పనిచేశారు. తొలిసారి 1983 నుంచి 1985 వరకు, అనంతరం 1998 నుంచి 2000 వరకు ఆ పదవిలో కొనసాగారు. 1999 ఎన్నికల్లో వైఎస్సార్ సారథ్యంలో ఎన్నికలకు వెళ్లారు. బీజేపీ-టీడీపీ వ్యూహాత్మకంగా వెళ్లడంతో కాంగ్రెస్ ఓటమిపాలైంది. పులివెందులలో వైఎస్ గెలవడంతో అసెంబ్లీలో ప్రతిపక్షనేతగా ఉన్నారు.
రూపాయి డాక్టర్ గా..
విద్యార్థి దశ నుంచే రాజకీయాలపై ఆసక్తి పెంచుకున్నారు వైఎస్. మెడిసిన్ పూర్తి చేసి వైద్య వృత్తిలో రూపాయికే వైద్య సేవలందించి.. ‘రూపాయి డాక్టర్’గా పేరు తెచ్చుకున్నారు.
వైఎస్ జయంతి.. రైతు దినోత్సవం..
ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కొనసాగిస్తోంది. వైఎస్ జయంతిని రైతు దినోత్సవంగా జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?