Ys Sharmila: వైఎస్ షర్మిల Ys Sharmila తెలంగాణ రాజకీయాల్లో తన ముద్ర వేసేందుకు శ్రమిస్తున్నారు. ఇప్పటికే తెలంగాణలో పార్టీ పెడుతున్నట్టు ప్రకటించి.. ఖమ్మంలో సభ నిర్వహించి.. జూలై 8న పార్టీ పేరు ప్రకటించబోతున్నట్టు తెలిపారు. రాజకీయంగా ఉనికిని చాటుకునే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ఆమె నిత్యం ప్రశ్నిస్తున్నారు. సీఎం కేసీఆర్ టార్గెట్ ఆమె తెలంగాణ సమస్యల్ని ప్రస్తావిస్తున్నారు. ఆమె విమర్శలపై సీఎం ఇంతవరకూ స్పందించకపోయినా.. ఆమె విమర్శలు ఆపడం లేదు. రీసెంట్ గా ఆమె కరోనా వైద్యాన్ని ఆరోగ్యశ్రీలో చేర్చాలంటూ డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అన్నివైపుల నుంచీ వస్తున్న డిమాండ్ల నేపథ్యంలో ఇటివలే కరోనా వైద్యాన్ని ఆయుష్మాన్ భారత్ లో చేర్చారు సీఎం కేసీఆర్. ఈ నిర్ణయంపై కూడా షర్మిల గళమెత్తారు.
‘కరోనా వైద్యం కోసం పేదలు అప్పు చేసి మరీ వైద్యం చేయించుకుంటున్నారు. తెలంగాణలో ఆరోగ్యశ్రీ వైద్యం పొందే అర్హత ఉన్న పేదవారు 80 లక్షల మంది వరకూ ఉన్నారు. కానీ.. దొర వారికి పేదల బాధలు కనిపించడం లేదు. కరోనా వైద్యాన్ని ఆయుష్మాన్ భారత్ లో చేర్చారు. దీనివల్ల కేవలం 30 లక్షల మంది మాత్రమే వైద్యం చేయించుకోగలరు. పైగా.. ఆయుష్మాన్ భారత్ లో ఏడాదికి 5 లక్షల వరకు మాత్రమే ఉపయోగం ఉంది.. ఆరోగ్యశ్రీలో 13 లక్షల వరకూ ఉపయోగపడుతుంది. తెలంగాణలోని 80 లక్షల మందికి కూడా కరోనా వైద్యం అర్హులే. కానీ.. కేసీఆర్ నిర్ణయం వల్ల వారంతా ఆరోగ్యశ్రీకి దూరం అవుతున్నారు. ఇప్పటికై కేసీఆర్ గారు కరోనా వైద్యాన్ని ఆరోగ్యశ్రీ చేర్చాలని డిమాండ్ చేస్తున్నా’ అని అన్నారు.
ఇదే క్రమంలో.. తెలంగాణలోని డ్వాక్రా సంఘాల రుణాలు, వడ్డీలను ప్రభుత్వం మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ అసమర్ధత, చేతగానితనం వల్ల 10లక్షల మందికి పైగా అక్కచెల్లెళ్లు అప్పుల పాలయ్యారని అన్నారు. అప్పులపాలైన కుటుంబాల్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఇలా నిత్యం సీఎం కేసీఆర్ టార్గెట్ గా షర్మిల రాజకీయ విమర్శలు చేస్తున్నారు. ఇప్పటికైతే సీఎం కేసీఆర్ ఆమె విమర్శలకు కౌంటర్ అయితే ఇవ్వడం లేదు. అలాగే.. తెలంగాణ రాజకీయాల్లో రాణించాలనే ఉద్దేశం ఉన్న షర్మిల పోరు ఆపడం లేదు.