కేసిఆర్ సర్కార్ పై ఇప్పటి వరకూ ఆరోపణలు మాత్రమే చేస్తూ వచ్చిన వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇప్పుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ ఎత్తున అవినీతి జరిగిందని షర్మిల గత కొద్ది రోజులుగా ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో అనేక ప్రాజెక్టులను మేఘా కృష్ణారెడ్డి సంస్థకే కేసిఆర్ సర్కార్ కట్టబెట్టడంపైనా తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు షర్మిల. బీజేపి, కాంగ్రెస్ నేతలు ఇప్పటి వరకూ కేసిఆర్ సర్కార్ పై రాజకీయ పరంగా విమర్శలు చేసినా నేరుగా కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేయలేదు.
అయితే షర్మిల మాత్రం కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై విచారణ జరిపించాలని కోరుతూ కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కి నేరుగా ఫిర్యాదు ఇవ్వడానికి రెడీ అయ్యారు. ఈ అంశంపై ఢిల్లీకి చేరుకున్న వైఎస్ షర్మిల నేటి మధ్యాహ్నం సీబీఐ డైరెక్టర్ ను కలవనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై విచారణ జరిపించాలని కోరనున్నారు. మరో పక్క ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అపాయింట్మెంట్ కూడా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. అపాయింట్మెంట్ లభిస్తే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని కూడా కలుసుకుని కేసిఆర్ సర్కార్ అవినీతిపై విచారణ జరిపించాలని కోరనున్నారు.
జాతీయ రాజకీయాల్లో క్రియాశీల భూమికను పోషించాలని టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా కేసిఆర్ మార్పు చేసిన రెండు రోజుల వ్యవధిలోనే షర్మిల నేరుగా ఢిల్లీకి వెళ్లి సీబీఐకి ఫిర్యాదు చేయడానికి సిద్దపడటం గమనార్హం. షర్మిల నేరుగా సీబీఐకి ఫిర్యాదు చేసినా కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు లేకుండా విచారణ జరిపే అవకాశాలు ఉండవు. ఈ తరుణంలో కేంద్రం ఏ విధంగా స్పందిస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది. జాతీయ స్థాయిలో బీజేపీకి పరోక్షంగా మేలు చేసేందుకే కేసిఆర్ జాతీయ పార్టీ స్థాపించారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది.