YS Sharmila: మెదక్ జిల్లాలో రైతు ఆత్మహత్యను పురస్కరించుకుని కేసిఆర్ సర్కార్ పై వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు చేశారు. మెదక్ జిల్లా బోగుడ భూపతిపూర్ లో రవికుమార్ అనే రైతు ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో శనివారం రైతు కుటుంబాన్ని వైఎస్ షర్మిల పరామర్శించారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబానికి కేసిఆర్ ప్రభుత్వం కోటి రూపాయలు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ షర్మిల దీక్ష చేపట్టారు. షర్మిల దీక్షను పోలీసులు భగ్నం చేశారు. మూడున్నర గంటల పాటు దీక్ష చేశారు. షర్మిలతో పాటు వైఎస్ఆర్ టీపీ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు.
YS Sharmila: ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వం
ఈ సందర్భంగా సీఎం కేసిఆర్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వరి వద్దన్న ముఖ్యమంత్రి మనకు వద్దు, ఇది ఒక నినాదం కావాలన్నారు. మద్దతు ధరకు వరి కొనుగోలు చేస్తామని టీఆర్ఎస్ సర్కార్ హామీ ఇచ్చిన తరువాత ఇప్పుడు వరి వేయవద్దనే హక్కు కేసిఆర్ కు ఎక్కడిదని షర్మిల ప్రశ్నించారు. ఒక సారి రైతులకు హామీ ఇచ్చిన తర్వాత వరి పంట కొనాల్సిన బాధ్యత మీకు లేదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. బంగారు తెలంగాణ అన్న కేసిఆర్ .. రైతులకు బతుకే లేకుండా నిరంకుశ పాలన చేస్తున్నారని విమర్శించారు. వానాకాలం వడ్లతో పాటు యాసంగి వడ్లు కూడా కేసిఆర్ కొనాల్సిందేనని డిమాండ్ చేశారు వైఎస్ షర్మిల. రైతు రవికుమార్ కు 50లక్షల వరకూ అప్పులే ఉన్నాయనీ, వరి వేసుకోవద్దంటే ఇంకో దారి మాకు లేదని రవికుమార్ ఆత్మహత్య చేసుకున్నాడని ఇది ఆత్మహత్య కాదు కేసిఆర్ చేసిన హత్యేనని అన్నారు. కేసిఆర్ రైతు వ్యతిరేకి, ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వం అంటూ వైఎస్ షర్మిల దుయ్యబట్టారు.