Telangana తెలంగాణలో పార్టీని స్థాపించేందుకు షర్మిల కసరత్తు ప్రారంభించారు. అందులోభాగంలో రాష్ట్రంలోని వైఎస్ఆర్ అభిమానులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలకు చెందిన వైఎస్ అభిమానులతో షర్మిల శనివారం ఆత్మీయ సమావేశం నిర్వహించారు. లోటస్పాండ్లో జరిగిన ఈ సమావేశానికి దాదాపు 500 మంది దాకా కార్యకర్తలు హాజరయ్యారు. అయితే ఈ సమావేశంలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. షర్మిల నోటి నుంచి ‘జై తెలంగాణ’ అనే మాట వినిపించినట్లు సమాచారం. షర్మిల ఒక్కసారి ఈ నినాదం ఇవ్వడంతో అభిమానులు ఉబ్బితబ్బిబయ్యారు. తెలంగాణలో బలమైన ముద్ర వేయాలనే షర్మిల ప్రయత్నిస్తున్నారు.
bhemఇటీవల షర్మిల అనుచరుడు కొండా రాఘవరెడ్డి మీడియాతో మాట్లాడుతూ వైఎస్ఆర్, ఉమ్మడి ఏపీలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను గుర్తు చేస్తూ టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు సంధించారు. ఇప్పుడు షర్మిల నోటి నుంచి ‘జై తెలంగాణ’ అనే నినాదం రావడంతో ప్రధానంగా టీఆర్ఎస్పైనే ఆమె గురిపెట్టినట్లు అర్థమవుతుందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఎందుకంటే ప్రస్తుతం రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారంలో ఉంది. కాబట్టి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీని నిర్ణించుకోవాలనే యోచనలో షర్మిల ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
Telangana తెలంగాణ కోడలు ఇమేజ్ తో జనాల్లోకి!
ఇక ఏపీకి చెందిన షర్మిల, ఇక్కడ పార్టీ పెట్టడమేంటంటూ ప్రత్యర్థి పార్టీల నుంచి వస్తున్న విమర్శలకు ఆమె సరైన సమాధానాన్ని సిద్ధం చేసుకుంటున్నారు. తెలంగాణ కోడలు హోదాలో జనంలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. రాష్ట్రంలో కొత్త పార్టీ పెట్టేందుకు షర్మిల కసరత్తు ప్రారంభించగానే.. అధికార టీఆర్ఎస్ సహా ప్రత్యర్థి పార్టీల నేతలు మొదటగా ఆమె స్థానికురాలు కాదన్న సంగతిని లేవనెత్తిన విషయం తెలిసిందే. తెలంగాణ కోడలు హోదాతో ప్రజల్లోకి వెళ్లాలని ఆమె అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇది తన మెట్టినిల్లు అని, తెలంగాణ కోడలికి రాజకీయంగా ఇక్కడ హక్కులు ఉండవా? అన్న నినాదంతో విమర్శలకు సమాధానం చెప్పాలని నిర్ణయించారు. ఇక తెలంగాణ పోరాట యోధుల చరిత్రనూ షర్మిల బృందం అధ్యయనం చేస్తున్నట్లు సమాచారం.
తెలంగాణ సాయుధ పోరాటాన్ని నడిపిన భీం రెడ్డి నర్సింహారెడ్డి, ధర్మభిక్షం వంటి పలువురు తెలంగాణ కమ్యూనిస్టు యోధులకు తగిన గుర్తింపు లేదని, నల్లగొండ జిల్లాలో ఏదైనా జాతీయ రహదారి, ప్రాజెక్టు.. మరో కట్టడానికో వారి పేర్లు పెట్టేలా భవిష్యత్తులో ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలన్న ఆలోచన కూడా చేస్తున్నట్లు చెబుతున్నారు. అలాగే తెలంగాణలో మరుగున పడ్డ యోధుల చరిత్రను వెలికితీసే ఆలోచన చేస్తున్నట్లు చెబుతున్నారు. షర్మిల పట్టుదల కలిగిన మహిళా నాయకురాలని, పక్కా ప్రణాళికతోనే బరిలోకి దిగిందని ఇవన్నీ గమనిస్తున్న రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు