YS Sharmila : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి కూతురు వైఎస్ షర్మిల తెలంగాణలో కొత్త పార్టీ పెట్టబోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె చాలా జాగ్రత్తగా పావులు కదుపుతున్నారు. అసలు షర్మిల పార్టీ ఎప్పుడు పెడతారు….? దానికి పేరు ఏమి పెడతారు…? ఆ తర్వాత పాదయాత్ర చేస్తారా లేదా…? అని అందరికీ అనేక రకాల డౌట్లు ఉన్నాయి. కానీ ఆమె టార్గెట్ చేయబోయే జనం ఎవరు అన్న విషయంపై క్లారిటీ లేదు.
మొత్తానికి షర్మిల ప్రవర్తిస్తున్న తీరు చూస్తుంటే… ఆ విషయం పై అందరికీ క్లారిటీ వచ్చేసినట్టు ఉంది. తాజాగా రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీలు చెందిన 400 మంది విద్యార్థి నేతలతో షర్మిల లోటస్ పాండ్ లో సమావేశమయ్యారు. ఒకవైపు ప్రభుత్వంపై అభిప్రాయాన్ని సేకరిస్తునే…. ముఖ్యమంత్రి రాజశేఖర్రెడ్డి విద్యార్థుల కోసం ప్రవేశపెట్టిన అనేక పథకాలను ఆమె తెలివిగా గుర్తు చేశారు. వైఎస్సార్ హయాంలో చేపట్టిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకం పేద విద్యార్థుల నుండి బాగా ఆదరణ పొందింది. ఇదే విషయాన్ని ఆమె పరోక్షంగా విద్యార్థి నేతలతో చెప్పించడం గమనార్హం.
అంతేకాకుండా కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల పై విద్యార్థి నేతలతోనే మాట్లాడించారు. అలాగే యువతకు ఉద్యోగాలు కల్పన వైయస్ హయాంలో ఉండేదని గుర్తు చేస్తూ ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఏమిటనే విషయంపై వారితో సుదీర్ఘంగా చర్చించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ మన ఉద్యోగాలు, మన చదువులు అంటూ అనేక నినాదాలు ఇచ్చారు. ఇప్పుడు షర్మిల ఎంతో తెలివిగా ముందు యువతిని తన దారికి తెచ్చుకున్నారు. అధికారంలోకి వచ్చి సుమారు ఏళ్లు గడిచినా కానీ కేసీఆర్ అప్పుడు ప్రకటించిన హామీలు ఒక్కటి కూడా సరిగ్గా అమలు కాలేదు.
యువతలో కేసీఆర్ పై తీవ్రస్థాయిలో అసంతృప్తి పెరిగిపోయిందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలంగాణలో నిరుద్యోగ శాతం కూడా ఎక్కువ అయిపోయింది. ఇక రాష్ట్రం మొత్తం విద్యార్థుల ఉద్యమానికి కేరాఫ్ అడ్రస్ ఉస్మానియా యూనివర్సిటీ అని తెలిసిందే. కాబట్టి ఆ విషయాన్ని గుర్తుంచుకొని వారికి అధిక సమయాన్ని, ప్రాముఖ్యతను కేటాయిస్తున్నారు షర్మిల. ఇక ముందు విద్యార్థి నేతల మద్దతు సంపాదించగలిగితే రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో మద్దతు సంపాదించడం తేలిక అవుతుందని షర్మిల అంచనా వేసినట్లుగా అనిపిస్తోంది.