YS Sharmila : ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల తెలంగాణలో ఏర్పాటు చేయబోయే పార్టీ పేరు ఖరారైపోయిందా? వైఎస్సార్టీపీ పేరుతోనే ఆమె కొత్త పార్టీని ప్రారంభించనున్నారా? ఈ పేరు కోసం ఎన్నికల కమిషన్కు ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నారా? అంటే.. లోట్సపాండ్ వర్గాలు అవుననే అంటున్నాయి. వైఎస్ రాజశేఖర్రెడ్డి జయంతిని పురస్కరించుకుని జూలై 8న పార్టీ పేరును ప్రకటించనున్నట్లు చెబుతున్నాయి.
వైఎస్ జగన్ నాయకత్వంలోని వైఎస్సార్సీపీ పేరు తెలంగాణలోనూ క్షేత్రస్థాయి వరకు తెలిసి ఉన్న నేపథ్యంలో వైఎస్సార్టీపీ పేరుకే షర్మిల మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. అయితే వైఎస్సార్సీపీ పేరుతో తెలంగాణలోనూ పార్టీ రిజిస్టర్ అయి ఉండడం, దాంతో సామీప్యం ఉన్నందున వైఎస్ జగన్ అభ్యంతరం చెబితే ఇబ్బందులు తలెత్తే అవకాశమూ ఉందంటున్నారు. కానీ, వైఎస్ జగన్ అభ్యంతరం చెప్పబోరని లోట్సపాండ్ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. అన్నీ అనుకున్నట్లు జరిగితే జూలై 8న వైఎస్ జయంతిని పురస్కరించుకుని వైఎస్సార్టీపీ పేరును షర్మిల ప్రకటించే అవకాశం ఉందని చెబుతున్నాయి. అయితే తన రాజకీయ రంగ ప్రవేశంపై స్పష్టత మాత్రం ఏప్రిల్ 9న ఖమ్మంలో జరిగే సభలో ఇవ్వనున్నారు. తాను రాష్ట్రంలో కొత్తగా పార్టీని ప్రారంభించబోతున్నట్లు ప్రకటించి.. విధి విధానాలు ఎలా ఉంటాయో కూడా ఆ సభలో వివరించనున్నారు. ఖమ్మం సభ తర్వాత షర్మిల రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పర్యటిస్తారని, ఈ పర్యటనలు జూలై 8 లోపే ముగుస్తాయనీ చెబుతున్నారు. వైఎస్ జయంతి రోజున హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి పార్టీ పేరును షర్మిల ప్రకటిస్తారని తెలుస్తోంది.
YS Sharmila : వేగం పుంజుకున్న ఏర్పాట్లు !
షర్మిల కొత్తగా పెట్టబోయే పార్టీకి సంబంధించి కార్యక్రమాలను సమన్వయం చేసుకునేందుకు మండల స్థాయి వరకూ కమిటీలు వేస్తున్నారు. మండలానికి ముగ్గురితో ఈ కమిటీలను వేయాలని, ఈ నెల 16 కల్లా కమిటీల నియామకం పూర్తి కావాలని తన ముఖ్య అనుచరులను షర్మిల ఆదేశించారు. లోట్సపాండ్లో గురువారం జరిగిన సమావేశంలో ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. కమిటీల బాధ్యతను తన ముఖ్య అనుచరుడు పిట్టా రాంరెడ్డి, ఇటీవలే టీంలో చేరిన ఇందిరా శోభన్ తదితరులకు అప్పగించారు. మొదట నియోజకవర్గ స్థాయిలో ముగ్గురు సభ్యులతో కమిటీలను వేయనున్నారు. ఈ కమిటీలు.. మండల స్థాయి కమిటీలకు పేర్లను ప్రతిపాదిస్తాయి. ఆ పేర్లను పిట్టా రాంరెడ్డి తదితరులు పరిశీలించి ఖరారు చేస్తారు.