YS Viveka: ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విషయం హాట్ టాపిక్ గా నడుస్తోంది. రాష్ట్ర రాజకీయాలు మొత్తం ఈ కేసు చుట్టూనే తిరుగుతున్నాయి. ఓ వైపు తెలుగుదేశం పార్టీ, దాని అనుకూల మీడియా వైసీపీ ఎంపి అవినాష్ రెడ్డి పాత్ర ఉంది, ఆయన తండ్రి భాస్కరరెడ్డి చేయించారు, వారి వెనుక జగన్మోహనరెడ్డి పాత్ర ఏమైనా ఉందేమో వీళ్లందరినీ సీబీఐ విచారించాలని పట్టుబడుతోంది. టీడీపీ నాయకులు వర్ల రామయ్య, డేవిడ్ రాజు, దేవినేని ఉమా తదితర నేతలు మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు. ఇదే క్రమంలో టీడీపీ అనుకూల మీడియా ఈ కేసు మీదే ఎక్కువ పోకస్ పెట్టింది. గతంలో సీబీఐకి ఎవరెవరు వాంగ్మూలాలు ఇచ్చారు. వారు ఏమని చెప్పారు అనే విషయాలను ఒక్కటొక్కటిగా ప్రసారం చేస్తున్నారు. గత పది రోజులుగా రోజుకు ఒకరి వాంగ్మూలాన్ని బయటకు తీస్తూ వివేకా కేసులో కొత్త కొత్త విషయాలను బహిర్గతం చేస్తున్నాయి. ఇలా టీడీపీ, దాని అనుకూల మీడియా ఒక స్టాండ్ లో ఉంది.
YS Viveka: ఏవరి ప్రచారం వారిది
మరో వైపు వైసీపీ ఒక స్టాండ్ లో ఉంది. దాని అనుకూల మీడియా వారి స్టాండ్ ప్రకారం కథనాలు ఇస్తున్నాయి. ఇది చంద్రబాబు చేయిస్తున్నారు. ఇది టీడీపీ కుట్ర, వైఎస్ సునీత చంద్రబాబుకు పావుగా మారింది. చంద్రబాబు, ఆయన అనుకూల మీడియా వైఎస్ కుటుంబాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు అవినాష్ రెడ్డిపై కేసు రుద్దాలని చేస్తున్నారు అంటూ వైసీపీ ప్రచారం చేస్తోంది. ఈ ప్రచారం జనాలు నమ్మేలా సోషల్ మీడియాలో టీడీపీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తోంది. ఇలా ఎవరి ప్రయత్నాల్లో వాళ్లు ఉన్నప్పుడు బీజేపీ తన పాత్రను పోషిస్తూ ఉంది. కేసులో ప్రధాన నిందితుల్లో ఒకరైన దస్తగిరి గానీ, వైఎస్ సునీత, వైఎస్ కుటుంబీకుల్లో కొందరు అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కరరెడ్డి పేర్లను తమ వాంగ్మూలాల్లో పేర్కొన్నారు.
YS Viveka: అమిత్ షా గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే..?
గతంలో ఏప్పుడో సీబీఐ నమోదు చేసిన వాంగ్మూలాల్లో అవినాష్ రెడ్డి పేరు, ఆయన తండ్రి పేరు ఉంటే ఇప్పటి వరకూ వాళ్లకు ఎందుకు నోటీసులు ఇచ్చి విచారణ చేయలేదు అని అనేక మంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ కేసు మొత్తాన్ని నడిపించేది కేంద్రంలోని బీజేపీ. అంటే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. బీజేపీ అగ్రనాయకుల్లో ప్రధాని మోడీ తరువాత స్థానంలో ఉన్న అమిత్ షా నుండి గ్రీన్ సిగ్నల్ వస్తేనే ఈ కేసులో ఏమైనా జరుగుతుంది అని అందరూ అనుకుంటున్నారు. రాష్ట్రంలో వైసీపీ, టీడీపీ ఎవరు ఏమి చెప్పినా, మీడియాలో ఎన్ని కథనాలు వచ్చినా..ఈ కేసులో కీలక వ్యక్తుల అరెస్టులు ఉంటాయా..? ఉండవా..? అనేది తేల్చాల్సింది ఆ పెద్దాయనే అన్నది జగమెరిగిన సత్యం.