YS Viveka Case: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు నిందితుడు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి బెయిల్ కోసం మరో సారి ప్రయత్నం చేస్తున్నారు. ఇంతకు ముందు శివశంకర్ రెడ్డి బెయిల్ కోసం ప్రయత్నించినా ఫలితం లభించలేదు. ఈ కేసులో శివశంకరరెడ్డి పాత్రను సీబీఐ కోర్టుకు వెల్లడించి బెయిల్ మంజూరు చేయవద్దంటూ గతంలో వాదనలు వినిపించిన నేపథ్యంలో ఆయనకు బెయిల్ మంజూరు కాలేదు. ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా ఉన్న శివశంకర్ రెడ్డి మరో సారి కడప కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై సోమవారం సీబీఐ కౌంటర్ పిటిషన్ దాఖలు చేయనుంది.
Read More: YS Viveka Case: వివేకా హత్య కేసు ..చంద్రబాబు వర్సెస్ సజ్జల
YS Viveka Case: దర్యాప్తు వేగవంతం
మరో పక్క సీబీఐ అధికారులు హత్య కేసు దర్యాప్తును వేగవంతం చేశారు. సీీబీఐ డీఐజీ చౌరాసియా కడప సెంట్రల్ జైలు అతిధి గృహంలో మకాం వేసి దర్యాప్తునకు సంబంధించి అంశాలపై సమీక్ష జరుపుతున్నారు. హైకోర్టు తీర్పు దృష్ట్యా సీబీఐ అధికారులు వాంగ్మూలం పత్రాలను పులివెందుల కోర్టులో సమర్పించనున్నారు. వివేకా హత్య కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరితో మరో సారి కోర్టులో వాంగ్మూలం నమోదు చేయనున్నారు. వివేకా హత్య కేసులో మూడవ నిందితుడుగా ఉన్న వివేకా మాజీ డ్రైవర్ షేక్ దస్తగిరి అప్రూవర్ మారడానికి కడప సబ్ కోర్టు ఇంతకు ముందే అనుమతి ఇచ్చింది.
మరోసారి దస్తగిరి నుండి 164 సెక్షన్ కింద వాంగ్మూలం
దస్తగిరి అప్రూవర్ గా మారుతున్నాడనీ, 306 సెక్షన్ కింద సాక్షం నమోదు చేయాలని కడప సబ్ కోర్టులో సీబీఐ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై ఇతర నిందితులు ఎర్ర గంగిరెడ్డి, సునీల్ యాదవ్, ఉమా శంకర్ రెడ్డి తరపు న్యాయవాదులు అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ కోర్టు సీబీఐ వాదనలతోనే ఏకీభవించి దస్తగిరి అప్రూవర్ గా మారేందుకు అనుమతి ఇచ్చింది. దీంతో సీబీఐ అధికారులు మరోసారి దస్తగిరి నుండి 164 సెక్షన్ కింద మెజిస్ట్రెట్ సమక్షంలో వాంగ్మూలం నమోదు చేయించనున్నారు.