YS Viveka Murder Case: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఒకే రోజు రెండు కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. వివేకా హత్య కేసు దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. ఈ తరుణంలో సీబీఐ విచారణ ఎదుర్కొన్న ఒ వ్యక్తి ఫిర్యాదు నేపథ్యంలో కోర్టు ఆదేశాల మేరకు వివేకా కేసు దర్యాప్తు చేస్తున్న అధికారి రామ్ సింగ్ పై కడప రిమ్స్ పోలీస్ స్టే,న్ లో కేసు నమోదు అయ్యింది. ఇది ఒక కీలక పరిణామం కాగా, మరో పక్క వివేకా హత్య కేసులో అప్రూవర్ గా మారిన మూడవ నిందితుడు షేక్ దస్తగిరి సీబీఐ అధికారులకు గత సెప్టెంబర్ 30న ఇచ్చిన ఫిర్యాదు వివరాలు బయటికి వచ్చాయి. ఈ రోజు పులివెందుల కోర్టులో నలుగురు నిందితులను సీబీఐ హజరుపర్చింది. నిందితులకు సంబంధించిన అభియోగ పత్రాలు, ఫిర్యాదులను కోర్టు ఆదేశాలతో సంబంధిత న్యాయవాదులకు సీబీఐ అందజేసింది. అందులో భాగంగా దస్తగిరి గతంలో సీబీఐకి ఇచ్చిన ఫిర్యాదు బయటకు రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.
YS Viveka Murder Case: సాక్షిగా మారిన నిందితుడికి ప్రలోభాలు
వివేకా హత్య కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరి గత ఏడాది అక్టోబర్ 31న ప్రొద్దుటూరు కోర్టులో సెక్షన్ 164 కింద వాంగ్మూలం ఇచ్చారు. ఆ తరువాత సీబీఐకి ఎలాంటి వివరాలు చెప్పవద్దని మభ్యపెట్టి లొంగదీసుకునేందుకు సంప్రదించారని దస్తగిరి సెప్టెంబర్ 30వ తేదీన సీబీఐకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇందులో వైఎస్ అవినాష్ రెడ్డికి సన్నిహితుడైన పులివెందులకు చెందిన భరత్ యాదవ్ తరచు తన ఇంటికి వచ్చే వాడనీ, సీబీఐకి ఎలాంటి వివరాలు చెప్పావు. ఏం స్టేట్ మెంట్ ఇచ్చావు. ఆ వివరాలు అన్నీ అవినాష్ రెడ్డికి, దేవిరెడ్డి శివశంకరరెడ్డికి తెలియజేయాలని వేధిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తాను సీబీఐ నిఘాలో ఉన్నాననీ, ఎక్కడికీ రాలేననీ దస్తగిరి చెప్పినట్ల వివరాల్లో నమోదైంది. వివేకా హత్య కేసుకు సంబంధించి ఎటువంటి వివరాలు బయట పెట్టవద్దనీ, పది లేదా 20 ఎకరాల భూమి, ఎంత డబ్బు కావాలంటే అంత ఇస్తామని తనను మభ్యపెట్టారనీ దస్తగిరి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. తనను ఎవరెవరు ఎప్పుడు కలిసిందీ వివరాలు అందులో ఉన్నాయి.
దస్తగిరి ఫిర్యాదులో కీలక వ్యక్తులు
దస్తగిరి చెప్పిన కొత్త విషయాలు వెలుగులోకి రావడం, కీలక వ్యక్తుల పేర్లు ప్రస్తావించడంతో రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది. ఒక పక్క వివేకా కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారిపై పోలీసు కేసు నమోదు కావడం, మరో పక్క దస్తగిరి చెప్పిన కొత్త విషయాలు వెలుగులోకి రావడం రాష్ట్రంలో హాట్ టాపిక్ అయ్యింది. మరో పక్క తనకు, తన కుటుంబానికి రక్షణ కల్పించాలని దస్తగిరి సీబీఐ అధికారులను కోరారు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే తనకు ప్రాణ హాని ఉందని అన్నారు. తాను ఎవరి ప్రలోభాలకు లొంగి సీబీఐ వద్ద అప్రూవర్ గా మారలేదనీ, సోషల్ మీడియాలో తనపై దుష్ప్రచారం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశాడు దస్తగిరి. రెండవ సారి మెజిస్ట్రేట్ వద్ద వ్యాంగ్మూలం ఇచ్చిన నేపథ్యంలో తనకు, తన కుటుంబానికి రక్షణ కల్పించాలని కోరారు దస్తగిరి.