YSRCP : తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యుల్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నెల 23వ తేదీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుండగా, ఏప్రిల్ 17న పోలింగ్ జరగనున్నది. మే 2వ తేదీన ఓట్ల లెక్కింపు, ఫలితాలను వెల్లడించనున్నారు. తిరుపతి ఉప ఎన్నికకు ఈసీ షెడ్యుల్ ప్రకటించిన గంటల వ్యవధిలోనే వైసీపీ తమ అభ్యర్థిని ప్రకటించింది.
వైసీపీ తిరుపతి ఎంపి అభ్యర్థిగా డాక్టర్ గురుమూర్తిని సీఎం వైఎస్ జగన్ నిర్ణయించారు. ఈ మేరకు వైసీపీ కేంద్ర కార్యాలయం మంగళవారం సాయంత్రం ప్రకటన విడుదల చేసింది.
తిరుపతి వైసీపీ ఎంపిగా ఉన్న బల్లి దుర్గాప్రసాద్ కరోనా బారిన పడి మృతి చెందిన నేపథ్యంలో ఉప ఎన్నిక జరుగుతోంది. తొలుత ఈ ఉప ఎన్నికకు అభ్యర్థిగా బల్లి దుర్గా ప్రసాద్ కుమారుడు లేదా భార్యకు ప్రకటిస్తారని ఆ పార్టీ నేతలు భావించారు. అయితే జగన్మోహనరెడ్డి పాదయాత్ర సమయంలో ఫిజియోథెరఫీ సేవలు అందించిన డాక్టర్ గురుమూర్తిని అభ్యర్థిగా వైసీపీ అధినేత నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో దివంగత ఎంపి బల్లి దుర్గాప్రసాద్ తనయుడు కల్యాణ చక్రవర్తికి జగన్ గతంలోనే ఎమ్మెల్సీ ఇస్తామని హమీ ఇచ్చారు. ఆ హామీ మేరకు ఇటీవల ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలో చక్రవర్తికి అవకాశం ఇచ్చారు. ఈ క్రమంలో తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక అభ్యర్థిగా గురుమూర్తిని ఖరారు చేస్తూ వైసీపీ అధికారికంగా ప్రకటన విడుదల చేసింది.
కాగా ఇప్పటికే తెలుగుదేశం పార్టీ..తమ అభ్యర్థిని ప్రకటించింది. కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి అభ్యర్థిత్వాన్ని టీడీపీ ఖరారు చేసింది. తిరుపతిలో పార్టీ కార్యాలయాన్ని సైతం ప్రారంభించారు. ఇక బీజెపీ – జనసేన ఉమ్మడి అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది. ఇటీవల కాలం వరకూ తిరుపతి ఉప ఎన్నికల బరిలో జనసేన పోటీ చేయాలని భావించింది. అయితే రెండు రోజుల క్రితం జనసేన తమ ప్రతిపాదనను విరమించుకున్నది. ఉమ్మడి అభ్యర్థిగా బీజెపీ నేతను ఎన్నికల బరిలో నిలుపుతామని ప్రకటించారు. రిటైర్డ్ ఐఎఎస్ అధికారి ఒకరిని బీజేపీ అభ్యర్థిగా నిలిపే ఆలోచన చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. నేడో రేపో బీజేపీ అభ్యర్థిని ఆ పార్టీ ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.