దీన్ని జగన్ ఆపరేషన్ ఆకర్ష అనాలో, చంద్రబాబు ఆపరేషన్ వికర్ష అనాలో తెలియదు కానీ… టీడీపీ నుంచి ఒకరితర్వాత ఒకరు వైకాపాలో చేరిపోతున్నారు. ఇక్కడ జగన్ సూత్రానికి కట్టుబడి… గెలిచిన ఎమ్మెల్యేలు పసుపు కండువా తీసేస్తున్నారే తప్ప వైకాపా కండువా వేసుకోవడం లేదు. ఇది జగన్ మార్కు రాజకీయం. కానీ టీడీపీ నుంచి ఓడిపోయిన వారు మాత్రం వచ్చి ఫ్యాన్ కింద రిలాక్స్ అవుతున్నారు. అలా అని పార్టీ మారేందుకు వచ్చేవారికి చంద్రబాబు లాగా వైసీపీ అధిష్టానం బంపర్ ఆఫర్ లు ఏమీ ఇవ్వడం లేదు. మంత్రి పదవులు ఆశ చూపడం లేదు. అయినా కాని సైకిల్ దిగిపోవడానికే తమ్ముళ్లు శ్రద్ధ చూపిస్తున్నారు. ప్రస్తుతం వారి అతి శ్రద్ధే.. వైకాపా కేడార్ లో చికాకులు తెప్పిస్తుందని అంటున్నారు.
కొందరు వ్యాపారాలు కాపాడుకోవడానికి.. మరికొందరు ఆస్తులు నిలుపుకోవడానికి.. ఇంకొందరు రాజకీయ మనుగడ కోసం… కారణాలు ఏవైనా వారంతా అధికార వైసీపీ బాట పడుతున్న నేపథ్యంలో… ఇంతకాలం వైసీపీనే నమ్ముకొని ఉన్న వారికి అన్యాయం జరుగుతోందనేమాటలు వినిపిస్తున్నాయి. గత తొమ్మిదేళ్లుగా పార్టీ జెండా మోసి, జగన్ కు నిత్యం తోడుగా ఉన్న కేడర్ కు.. కొత్తగా వచ్చి చేరుతున్న మాజీ పసుపు బ్యాచ్ తో తలనొప్పులు వస్తున్నాయని గుసగుసలు వినిపిస్తున్నాయంట. ఎందుకంటే… నాయకులు మారినంతగా కేడర్ అంత సులువుగా మారలేరు… కొత్తవారితో సర్ధుకుపోలేరు! ఈ క్రమంలో… వైకాపాలో ఇలా జంపింగ్ చేసి వచ్చిన టీడీపీ మాజీ నేతల ప్రవర్తనతో కాస్త విసుగు వస్తుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
ఇది అధికారంలో ఉన్న పార్టీలకు ప్రతిసారీ జరిగే తంతే అయినా… గతంలో చంద్రబాబు ఇలాంటి తప్పే ఒకటి చేసి 23మంది వైకాపా ఎమ్మెల్యేలను చేర్చుకున్నారు. ఆ సమయంలో లోకల్ కేడర్ ఇబ్బందులు వర్ణణాతీతమనే వార్తలు వచ్చాయి! ఇదే క్రమంలో ఇలాంటి సమస్యలను చిన్నవిగా చూడకూడదనే కామెంట్లు వినిపిస్తున్నాయి. మొక్కలోనే తుంచకనిపక్షంలో చాలా ప్రమాదమే పొంచి ఉంటుంది.. కాకపోతే… ఏదైనా ఎన్నికలు జరిగిఏ వరకూ ఈ వ్యవహారం నివురుగప్పిన నిప్పులా ఉంటాది.. ఎందుకంటే ఉన్నది అధికారపార్టీలో కాబట్టి!