మాజీ మంత్రి, మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని, మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ లకు సీఎం జగన్ ఊహించని షాక్ ఇచ్చారు. ఈ ఇద్దరు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు అత్యంత సన్నిహితులు. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి 2014,2019 ఎన్నికల్లో కర్నూలు జిల్లా డోన్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి విజయం సాధించారు. జగన్ కేబినెట్ లో అత్యంత కీలకమైన ఆర్ధిక శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇక పేర్ని వెంకట్రామయ్య (నాని) జగన్ మొదటి కేబినెట్ లో రవాణా మరియు పౌరసంబంధాల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. మాజీ మంత్రి పేర్ని కృష్ణమూర్తి వారసుడుగా రాజకీయ రంగ ప్రవేశం చేసిన పేర్ని నాని 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున మచిలీపట్నం (బందరు) అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేసి అప్పటి టీడీపీ అభ్యర్ధి కొల్లు రవీంద్రపై విజయం సాధించారు. ప్రభుత్వ విప్ గా పని చేశారు.
పేర్ని నాని వారసుడుగా
వైఎస్ రాజశేఖరరెడ్డి మరణానంతరం 2013 లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి జగన్మోహనరెడ్డి నేతృత్వంలోని వైఎస్ఆర్ సీపీలో చేరారు పేర్ని నాని. 2014 ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసిన పేర్ని నాని నాటి టీడీపీ అభ్యర్ధి కొల్లు రవీంద్ర పై పరాజయం పాలైయ్యారు. ఎన్నికల్లో ఓటమి పాలైనా నియోజకవర్గంలో పార్టీ క్యాడర్ తో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తూ పార్టీలో యాక్టివ్ గా పని చేయడంతో 2019 ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే కొల్లు రవీంద్రపై పేర్ని నాని విజయం సాధించారు. ఆ తరువాత జగన్ తన కేబినెట్ లో కీలక పోర్ట్ పోలియో ఇచ్చారు. అయితే ముందుగా నిర్ణయించిన ప్రకారం రెండున్నర సంవత్సరాల తరువాత మంత్రి పదవుల నుండి తప్పుకోవాలన్న పార్టీ నిర్ణయం మేరకు పేర్ని నాని మంత్రి పదవిని వదులుకోవాల్సి వచ్చింది. ఈ ఇద్దరి రాజకీయ నేపథ్యం ఇలా ఉండగా, వచ్చే ఎన్నికల్లో వారి వారసులను రంగంలోకి దించాలనే ప్రయత్నంలో ఉన్నారు. ఆ క్రమంలో భాగంగా పేర్ని నాని కుమారుడు పేర్ని కిట్టూను పార్టీలో యాక్టివ్ చేశారు. తన రాజకీయ వారసుడుగా క్యాడర్ కు పరిచయం చేశారు. పార్టీ కార్యక్రమాల్లో పేర్ని కిట్టూ చురుగ్గా పాల్గొంటున్నారు. మూడు నెలల క్రితం జరిగిన ఓ బహిరంగ సభలోనే పేర్ని నాని రాబోయే ఎన్నికల్లో పోటీ చేయడం లేదనీ, ఆయన కుమారుడు కిట్టూ పోటీ చేస్తారని మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ప్రకటించారు. రాబోయే ఎన్నికల్లో పేర్ని కిట్టూ ఘన విజయం సాధించడం ఖాయమని అన్నారు కొడాలి నాని.
మరో పక్క బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి తన కుమారుడు బుగ్గన అర్జున్ రెడ్డిని యాక్టివ్ చేశారు. వచ్చే ఎన్నికల్లో కుమారుడిని ఎన్నికల్లో దింపాలని ఆశపడుతున్నారు. ఒక పక్క పేర్ని నాని, మరో పక్క బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిలు తమ వారసులను ఎమ్మెల్యేలుగా చేయాలని ఆశపడుతుండగా, వారి ఆశలపై నీళ్లు చల్లారుట సీఎం వైఎస్ జగన్. రాబోయే ఎన్నికల్లో వారసులకు నో ఛాన్స్ అని చెప్పేశారుట. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై నిన్న జరిగిన సమీక్షలో జగన్ దీనిపై క్లారిటీ ఇచ్చినట్లు సమాచారం. కొంత మంది తాము తిరగకుండా తమ వారసులు నియోజకవర్గంలో తిరుగుతున్నారని చెబుతున్నారనీ, అది కుదరదని జగన్ స్పష్టం చేశారు. మీరు మీ పిల్లలను రాజకీయ వారసులుగా ప్రొజెక్టు చేసుకుంటే చేసుకోండి కానీ ఎన్నికల్లో మాత్రం మీరే ఈ సారి పోటీ చేయాలని సీఎం జగన్ వారికి క్లారిటీగా చెప్పారుట. ఈ సమయంలో పేర్ని నాని తాను పార్టీ కోసం పూర్తి సమయాన్ని కేటాయిస్తానంటూ చెప్పబోయే ప్రయత్నం చేయగా, అవన్నీ కాదు ఈ సారి మీరిద్దరూ పోటీ చేయాల్సిందేనన్నట్లుగా పేర్ని, బుగ్గనలను ఉద్దేశించి చెప్పేశారుట. ఇదే సమయంలో పలు కీలక సూచనలు కూడా నేతలకు చేశారు సీఎం జగన్. ఇక పార్టీ అధినేత, సీఎం జగన్ ఆదేశాలతో వీరు కూడా ఇకపై గడపగడపకు వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.
జనంలో ఉన్న వారికే ఎన్నికల్లో సీట్లు .. మరో సారి స్పష్టం చేసిన వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్