తిరుపతి ఎంపీగా 2 లక్షలకు పైగా మెజారిటీతో గెలిచిన బల్లి దుర్గాప్రసాద్ మరణంతో ఖాళీ అయిన స్థానానికి ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు అన్ని పార్టీలు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. దీనిపై అధికార పార్టీ వైఎస్ఆర్సిపి సైతం దృష్టి పెట్టింది. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గురువారం తిరుపతి లోక్సభ పరిధిలోని ఏడు నియోజకవర్గాల నాయకులతో సమావేశం నిర్వహించారు. మంత్రులు సైతం పాల్గొన్న ఈ సమావేశంలో ఎంపీ అభ్యర్థిగా ముఖ్యమంత్రి ఎవరు నిర్ణయించిన గెలిపించుకునే బాధ్యత తాము తీసుకుంటామని మంత్రులు స్పష్టం చేశారు. వారి దీమా వెనుక అసలు కారణం ఏంటి తిరుపతి లోక్సభ పరిధిలో వైఎస్ఆర్సిపి గెలుపు అంత సులభమా? ఎందుకీ ఓవర్ కాన్ఫిడెన్స్ అనే అంశాలను ఒకసారి పరిశీలిస్తే….
* తిరుపతి లోక్సభ పరిధిలో ఉన్న ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల అయిన గూడూరు,సూళ్లూరుపేట, సత్యవేడు ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గాలు. మిగిలిన సర్వేపల్లి, శ్రీకాళహస్తి, వేంకటగిరి, తిరుపతి ఆన్ రిజర్వుడ్ నియోజకవర్గాలు. 2019 ఎన్నికల్లో అన్ని నియోజకవర్గల్లో అధికార పార్టీ ఎమ్మెల్యేలు గెలిచారు. ఇక్కడ ఆధిక్యం సుస్పష్టం.
* ఎస్సీ నియోజకవర్గాలు గా ఉన్న మూడు నియోజకవర్గాల్లో అధికార పార్టీ వైఎస్ఆర్సిపి కు భారీ ఆధిక్యత వచ్చింది. సత్యవేడు నియోజకవర్గంలో 42 వేలకు పైగా మెజార్టీ రాగా, గూడూరులో 45000, సూళ్లూరుపేట లో 73 వేల మెజారిటీ ను సాధించారు. ఈ మూడు నియోజకవర్గాల నుంచే వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి అయిన బల్లి దుర్గాప్రసాద్ కు మంచి మెజారిటీ వచ్చింది.
* ఆన్ రిజర్వుడు నియోజకవర్గాల్లో అంతంత మాత్రంగానే మెజారిటీ వచ్చిన అక్కడ కూడా మంచి ఓట్లు వైఎస్ఆర్సిపి సాధించింది. ఎస్సీ నియోజకవర్గాల్లో పార్టీ బలిష్టంగా ఉంది. గ్రామస్థాయి నాయకత్వం గట్టిగా కనిపిస్తోంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు వారికి అందిన ఉత్సాహం స్పష్టంగా కనిపిస్తోంది. మిగిలిన పార్టీల నుంచి వలసలు ఎస్సి నియోజకవర్గాల్లో అధికంగా ఉన్నాయి.
* పనబాక లక్ష్మి అభ్యర్థిత్వంపై ఎలాంటి విమర్శలు లేకున్నా, ఈసారి ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు ఏమైనా ఉంటే అవి టిడిపి, బిజెపి, జనసేన పంచుకోవాల్సి వస్తుంది. దీనివల్ల లాభపడేది వైఎస్సార్సీపీనే.
* గ్రామ స్థాయిలో టీడీపీ కు కాస్తోకూస్తో కేడర్ ఉన్న బిజెపి కు అసలు కొన్ని చోట్ల నాయకత్వమే లేదు. అధికార పార్టీ గా ప్రస్తుతం గ్రామ స్థాయిలో సైతం బలంగా ఉన్న వైఎస్ఆర్సిపి గెలుపు చాలా సులభంగానే లభిస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
* బల్లి దుర్గాప్రసాద్ మరణంతో ఏర్పడిన సానుభూతితో పాటు, దాదాపు వైఎస్ఆర్సీపీ ఎంపీ టికెట్ ను బల్లి దుర్గాప్రసాద్ కుటుంబానికే ఇచ్చేందుకు ముఖ్యమంత్రి సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే సానుభూతి పని చేస్తుంది అని భావించవచ్చు.
* తిరుపతి లోక్ సభ పరిధిలో 15,75,000 ఓటర్లు ఉన్నారు. గత ఎన్నికల్లో 7,22,877 ఓట్లను వైస్సార్సీపీ సాధిస్తే, టీడీపీ 4,94,501 ఓట్లను సాధించింది. ఈ సారి ఆ లెక్క మరింత పెరిగే అవకాశం ఉందని, మెజారిటీ సైతం పెరుగుతుందని వైస్సార్సీపీ నాయకులు భావిస్తున్నారు.
* మరోపక్క లోక్సభ ఎన్నికలకు సంబంధించి ప్రతి నియోజకవర్గానికి ఒక మంత్రిని బాధ్యుడిగా చేసి ప్రతి మండలానికి ఒక ఎమ్మెల్యేకు బాధ్యతలు అప్పగించాలని వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆలోచిస్తున్నారు. అలా జరిగితే వచ్చే ఏడాది మంత్రివర్గ విస్తరణ ఉండే నేపథ్యంలో సదరు మండలంలో పోటీపడి మరి ఎమ్మెల్యే లు పని చేసే అవకాశం ఉంది. అధినేత దగ్గర మంచి మార్కులు కొట్టేయడానికి తిరుపతి లోక్సభ ఉప ఎన్నికలు ఉపయోగించుకుని అవకాశాన్ని కొట్టిపారేయలేం.