Kuppam : మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పానికి వస్తున్నారంటే గతంలో ఓ రేంజ్లో స్వాగత ఏర్పాట్లు ఉండేవి. కానీ ఇప్పుడు నిరసనలు స్వాగతం పలికే సీన్లు కనిపిస్తున్నాయి. పరిస్థితి ఎందుకిలా మారింది..? చంద్రబాబు..కుప్పం. ఈ రెండు పేర్లకు బలమైన బంధం ఏర్పడి దశాబ్దాలవుతోంది. వైఎస్ కుటుంబానికి పులివెందుల ఎలాగో.. టీడీపీ అధినేత చంద్రబాబుకు కుప్పం అలాగ. టీడీపీ బాస్ ఎక్కడున్నా కనుసైగతో కుప్పంను శాసిస్తారు.
అక్కడ ఆయన మాటే వేదం.. శాసనం. అలాంటిది 2019 ఎన్నికల నుంచి అక్కడ టీడీపీ హవా తగ్గుతూ వస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబుకు మెజార్టీ తగ్గడం.. ఈ మధ్య జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఫ్యాన్ హవాతో సమీకరణాలు మారినట్టు కనిపిస్తోంది.నిజానికి అసెంబ్లీ ఎన్నికల నుంచి కుప్పంలో స్పెషల్ ఎఫెర్ట్ పెట్టిన వైసీపీ.. పంచాయతీ ఎన్నికల నాటికి వ్యూహం మార్చేసింది. కుప్పం నియోజకవర్గంలో 89 పంచాయతీలు ఉంటే.. వైసీపీ ఖాతాలో 75 పడ్డాయి. టీడీపీకి 13 దక్కాయి. ఈ ఫిగర్ చూసిన తర్వాత టీడీపీ శిబిరంలో కలకలం మొదలైంది. కుప్పంలో ఏం జరుగుతుందా అన్న ఆందోళన మొదలైంది. గత రెండు ఎన్నికల్లో చంద్రబాబు మెజారిటీ కాస్త తగ్గినా.. పసుపు జెండా ఎగరడం మాత్రం ఖాయంగా వస్తుంది. ఈ కోటకు బీటలు వేయాడమే లక్ష్యంగా వైసీపీ రచించిన వ్యూహం టీడీపీ శ్రేణులతో పాటు అధినేతకు మైండ్ బ్లాంక్ చేసినంత పని చేసింది. ఊహకు అందని విధంగా వైసీపీ కుప్పంలో పుంజుకుందా అని ఆశ్చర్యపోతున్నారు తెలుగు తమ్ముళ్లు. ఇప్పుడు పంచాయతీ ఫలితాలు చూసిన తర్వాత వెంటనే కుప్పం వెళ్లాలని చంద్రబాబు డిసైడయారు.
Kuppam : అడుగడుగునా అడ్డంకులు!
పంచాయతీ ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత గురువారం సొంత నియోజకవర్గంలో అడుగు పెట్టారు టీడీపీ అధినేత చంద్రబాబు. కుప్పం కేడర్ తీవ్ర నిరాశ, ఆవేదనలో ఉన్న నేపథ్యంలో వారిలో ధైర్యం నింపే ప్రయత్నాలు మొదలు పెట్టారు. మూడు రోజులు ఆయన ఇక్కడే ఉంటారు. మండలాల వారీగా… కార్యకర్తలతో భేటీకి ప్లాన్ చేశారు. అయితే, చంద్రబాబు కుప్పం టూర్ ఎప్పుడూ లేనిది ఈసారి టెన్షన్ రేపుతోంది. వైసీపీ నేతల వార్నింగ్స్తో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ కొనసాగుతోంది. ఇన్నేళ్ల నుంచి నియోజకవర్గానికి చంద్రబాబు చేసిందేమీ లేదని, కరోనా టైమ్లోనూ కనీసం జనాన్ని పట్టించుకోలేదని, పంచాయతీ ఎన్నికల్లో ఓడిపోయే సరికి కుప్పం గుర్తుకు వచ్చిందా… అంటూ నిలదీస్తున్నారు వైసీపీ నేతలు.ప్రతిపక్షనేత చంద్రబాబును వైసీపీ నేతలు అడుగడుగునా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష నేత టూర్లో భద్రతను పెంచారు పోలీసులు.
టిడిపి ఫ్లెక్సీల్లో ఎన్టీఆర్ ఫ్యామిలీ ఫొటోలు!
మరోవైపు ఎప్పుడూ లేనిది ఈసారి అధినేత టూర్లో ఎన్టీఆర్ ఫ్యామిలీ ఫొటోలు ఆసక్తిగా మారింది. గతంలో చంద్రబాబు ఎప్పుడు వచ్చినా ఆయన ఫొటోలతోనే ఫ్లెక్సీలు పెట్టే వారు. ఇప్పుడు గుడుపల్లిలో పెట్టిన బ్యానర్లలో జూనియర్ ఎన్టీఆర్, హరికృష్ణ, బాలకృష్ణల ఫొటోలు ఉన్నాయి. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఫొటోను కూడా బ్యానర్లలో పెట్టారు. అదే కుప్పం టీడీపీలో కొత్త చర్చకు దారితీస్తోంది.