Nagarjuna Sagar : నాగార్జునసాగర్ Nagarjuna Sagar ఉప ఎన్నిక ప్రస్తుతం తెలంగాణ రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇన్నాళ్లూ తిరుగులేని టీఆర్ఎస్ పార్టీకి దుబ్బాక ఉప ఎన్నికల భారీ ఝలక్ ఇచ్చింది. లక్ష ఓట్ల మెజారిటీని పక్కన పెడితే కనీసం సానుభూతి కూడా వర్కౌట్ కాకపోవడం అధికార పార్టీకి షాక్ ఇచ్చేదే. అక్కడ గెలిచిన బీజేపీ.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ సత్తా చాటి గులాబీ దళానికి చెక్ పెట్టింది. 2019 ఎంపీ ఎన్నికల్లో నిజామాబాద్ లో సీఎం కేసీఆర్ కుమార్తె కవిత కూడా బీజేపీ అభ్యర్ధి అరవింద్ చేతిలోనే ఓడిపోయారు. ఇన్ని అనుభవాలతో నాగార్జునసాగర్ లో ఆచితూచి అడుగులేస్తోంది టీఆర్ఎస్. అయితే.. ఆ ఉప ఎన్నికల్లో వైసీపీ నుంచి ఒక అభ్యర్ధి నామినేషన్ వేయడం ఇప్పుడు సంచలనంగా మారుతోంది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే వైసీపీ పార్టీని స్థాపించారు జగన్. అయితే.. రెండు రాష్ట్రాలయ్యాక జగన్ పూర్తి ఫోకస్ ఏపీలోనే పెట్టారు కానీ.. తెలంగాణ వైపు కన్నెత్తి చూడలేదు. అప్పటినుంచి తెలంగాణలో జరిగిన ఏ ఎన్నికల్లో కూడా వైసీపీ పోటీకి దిగలేదు. అయితే.. అనూహ్యంగా ఇప్పడు సాగర్ ఉప ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధి నామినేషన్ వేయడం చర్చనీయాంశమైంది. పార్టీలను పక్కనపెడితే 12 మంది ఇండిపెంట్లతోపాటు వైసీపీ నుంచి ఒక నామినేషన్ దాఖలైనట్టు రిటర్నింగ్ అధికారి చెప్పారు. దీంతో తెలంగాణలో వైసీపీ పోటీ ఏంటనే చర్చ మొదలైంది. స్థానికంగా ఉండే వైసీపీ అభిమాని వేసిన నామినేషనా లేక ఏపీ నుంచే అమలైన ఆదేశాలా? అని రాజకీయవర్గాల్లో చర్చ నడుస్తోంది.
వైసీపీ పార్టీ నుంచి టీఆర్ఎస్ కే సపోర్టు ఉంటుంది. కానీ.. ఈసారి నామినేషన్ పడింది. టీఆర్ఎస్-కాంగ్రెస్-బీజేపీ మధ్య గట్టి పోటీ ఉన్న నేపథ్యంలో వైసీపీ పోటీ చేస్తే ఓట్లు చీలి అవి టీఆర్ఎస్ కే లాభం జరుగుతుంది కాబట్టి.. ఇదొక వ్యూహం అనేవాళ్లూ లేకపోలేదు. కాంగ్రెస్ నుంచి జానారెడ్డిని ఉప ఎన్నికల్లో పోటీకి సిద్ధమయ్యారు. బీజేపీ, టీఆర్ఎస్ నుంచి ఇంకా అభ్యర్ధులు ఖరారు కాలేదు. నోముల నర్సింహులు కుమారుడు భగత్ కే సీటిద్దామని టీఆర్ఎస్ భావించినా దుబ్బాకలో తగిలిన షాక్ తో వెనకడుగు వేసిందని తెలుస్తోంది. మరి ఈ ఎన్నికల్లో విజయమెవరిదో చూడాల్సిందే..!