వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా మరింత పటిష్టం చేయడానికి పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్.జగన్మోహన్రెడ్డి గారు ఈ క్రింది నిర్ణయాలు తీసుకున్నారు. దీంట్లో భాగంగా జిల్లాల వారీగా పార్టీ బాధ్యతలను ముగ్గురు నేతలకు అప్పగించారు.
ఈ నిర్ణయాల ప్రకారం రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలను… వైవీ. సుబ్బారెడ్డి ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు, చిత్తూరు జిల్లాలను… సజ్జల రామకృష్ణారెడ్డి కర్నూలు, అనంతపురం, కడప, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో పార్టీ వ్యవహారాలను పర్యవేక్షిస్తారు. తాడేపల్లిలో ఉన్న పార్టీ కేంద్ర కార్యాలయ సమన్వయ బాధ్యతలను సజ్జల రామకృష్ణారెడ్డి చూడాల్సిందిగా పార్టీ అధ్యక్షులు నిర్ణయించారు.
ఇదీ వార్త. పట్టించుకోకపోతె పెద్ద విషయమేమి కాదు. కానీ వైవి సుబ్బారెడ్డికి జిల్లాలు పెరిగాయి. సజ్జల కి జిల్లాలు పెరిగాయి. విజయ సాయి రెడ్డికి అలాగే ఉన్నాయి. అయోధ్య రామిరెడ్డి అనే నేత చూసిన జిల్లాలను ఇప్పుడు విభజించి, కొత్తగా ఇంచార్జిలను నియమించారు. దీనిలో విజయ సాయిరెడ్డి కి కొత్త బాధ్యతలు అప్పగించకుండా సజ్జలకి పెంచడం, వైవి కి పెంచడం పైనే అనుమానాలన్నీ. నిజానికి ఈ ముగ్గురు మధ్య గడిచిన కొద్దీ కాలంగా నంబర్ 2 స్థానం కోసం అంతర్గత పోరాటం జరుగుతుంది. వైవి పెద్దగా రేసులో లేకపోయినా.. సజ్జల, విజయసాయిరెడ్డి మధ్య మాత్రం జరుగుతుంది. తాజా మార్పుల్లో సజ్జల బాధ్యతల పెంపు… ఆయన వర్గానికి సానుకూల సంకేతాలు పంపిస్తుంది.
వైసిపిలో ఈ మార్పు శ్రేణులు ఊహించకపోవచ్చు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విజయ సాయి రెడ్డికి బాధ్యతలు పెరుగుతాయి అనుకుంటే… సజ్జల ప్రాధాన్యత పెరుగుతుంది. పార్టీ నిర్ణయాల్లో, ఇంఛార్జుల నియామకంలో.., కీలకమైన మంత్రివర్గ కూర్పులో కూడా సజ్జలకి జగన్ ప్రాధాన్యత ఇవ్వడం ఓ వర్గానికి సందేహాలు పెంచుతుంది. అందుకు కారణాలు అనేకం. నిజానికి విజయసాయిరెడ్డి ప్రాధాన్యత తగ్గింది అనుకునే కంటే… ఆయనకు జగన్ కీలకంగా చూసుకుంటున్న విశాఖ బాధ్యతలు అప్పగించారు అనేదే కీలకం. పాజిటివ్ కోణంలో ఆలోచించే వారు మాత్రం సాయిరెడ్డికి ఏ మాత్రం బాధ్యతలు తగ్గలేదని, విశాఖ ఆయన చేతుల్లోనే ఉందని అనుకుంటారు. కానీ విజయ సాయిరెడ్డికి వ్యతిరేకంగా ఈ మధ్య తయారవుతున్న బ్యాచ్ మాత్రం ఆయన ప్రాధాన్యత తగ్గినట్టు ప్రచారం చేస్తుంది. ఇది పార్టీలో కనిపించని స్థాయిలో వర్గాలకు మాత్రం బీజం వేస్తుంది అనడంలో సందేహం లేదు.