విజయనగరం జిల్లాకు చెందిన వైసీపీ పార్టీ సీనియర్ నాయకుడు పెన్మత్స సాంబశివరాజు ఇటీవల అనారోగ్యంతో మరణించడం జరిగింది. పార్టీకి ఎప్పటినుండో అనేక సేవలు అందిస్తూ వచ్చిన పెన్మత్స సాంబశివరాజు కుటుంబానికి ఎలాగైనా న్యాయం చేయాలని వైసీపీ అధ్యక్షుడు జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పెన్మత్స సాంబశివరాజు తనయుడు డాక్టర్ పెనుమత్స సూర్యనారాయణరాజు (సురేష్ బాబు) ను ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి దింపాలని జగన్ డిసైడ్ అయినట్లు సమాచారం.
ఇటీవల రాజ్యసభ సభ్యుడిగా ఎంపికైన మంత్రి మోపిదేవి వెంకటరమణ రాజీనామాతో ఖాళీ అయిన ఎమ్మెల్సీ సీటుకు త్వరలో ఎన్నిక జరగనుంది. దీనికి సంబంధించి ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ కూడా విడుదల చేయడం జరిగింది. అయితే ఈ సీటు విషయంలో మొదటి నుండి మర్రి రాజశేఖర్ అదేరీతిలో ఆకేపాటి అమర్నాథరెడ్డి, త్రిమూర్తులు ఆశిస్తున్న తరుణంలో….వారందరినీ పక్కనపెట్టి జగన్ సురేష్ బాబు పేరును ఖరారు చేసినట్లు పార్టీ వర్గాల నుండి అందుతున్న సమాచారం.
పరిస్థితి ఇలా ఉండగా గతంలో పెన్మత్స సాంబశివరాజు బతికి ఉన్న టైంలో ఎమ్మెల్సీ పదవి కోసం ఎన్నో ప్రయత్నాలు చేశారు. అయితే ఆయన మరణం వెంటనే తనయుడికి ఎలాంటి ప్రయత్నాలు చేయకుండా జగన్ ఎమ్మెల్సీ పదవి ఇస్తున్నట్లు వార్తలు రావడంతో అదృష్టం అంటే ఇదేరా అని పార్టీ నేతలు లోలోపల చర్చించుకుంటున్నారట.