కరోనా వస్తుంది…. దానంతట అదే వెళ్లి పోతుంది. ఇక భవిష్యత్తులో రాష్ట్రంలో కరోనా బారిన పడని వాళ్ళు ఎవరూ ఉండరు అంటూ ముఖ్యమంత్రి జగన్ అన్న మాటలను వైసీపీ నేతలు చాలా సీరియస్ గా తీసుకున్నట్లు ఉన్నారు. సామాజిక దూరం అనే మాటనే మరిచి వారు ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారు. ఎక్కడికక్కడ నిబంధనలు పాటించకుండా సభలు-సమావేశాలు శుభకార్యాలు తమ ఇళ్ళలో జరుపుకుంటున్నారు. ఇలా జరుగుతున్న కార్యక్రమాల్లో కరోనా కేసులు భారీగా బయటపడుతున్నాయి.
బాపట్ల ఎంపీ నందిగం సురేష్ తన ఇంట్లో శుభకార్యం నిర్వహించారు. శుభకార్యాలకు ఇప్పుడు తహసీల్దార్ల అనుమతి తీసుకోవాలి. ఇక వారు కూడా శుభకార్యల్లో పాల్గొనేందుకు కేవలం 20 మంది వరకే అనుమతిని ఇవ్వగలరు. అయితే నందిగం సురేష్ కుటుంబంలో జరిగిన శుభకార్యానికి రెండు వేల మంది హాజరయ్యారు. ఒక్క నిబంధనా పట్టించుకోలేదు. సగం మందికి పైగా అతిథులకు మాస్కులు లేవు. ఇంకేముంది…. పెళ్లికి హాజరైన పలువురికి లక్షణాలు బయట పడ్డాయి. ప్రస్తుతానికి 20మందికి పాజిటివ్ అని తేలింది…. ఇంకా చాలామంది రిపోర్టర్లు రావాల్సి ఉంది. ఈ పెళ్లి వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది.
ఈ రేంజ్ లో బయటపడ్డది కేబలం నందిగం సురేష్ ఒక్కడి వ్యవహారమే. చాలా చోట్ల వైసిపి చోటా.. మోటా లీడర్లు కూడా పట్టించుకోవడం లేదు. అనంతపురం జిల్లా రాయదుర్గం లో గౌని ఉపేందర్ రెడ్డి అనే వైసీపీ నేత కి నాలుగు రోజుల క్రితం పాజిటివ్ అని తేలింది. రెండు రోజుల తర్వాత ఎమ్మెల్యేలతో కలిసి అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ విషయం అధికారులకు కలెక్టర్ కు ఫిర్యాదు చేయవలసి వచ్చింది. బయటపడ్డ వచ్చిన సరే వైసీపీ నేతలు సూపర్ స్ప్రెడర్ లు గా మారుతున్నారు కానీ ఆదర్శవంతంగా నిలిచేందుకు మాత్రం ప్రయత్నించడం లేదు.
ఈ ప్రభుత్వం మాదే కాబట్టి ఏ నినంధనలు మేము పాటించాల్సిన అవసరం లేదని అనుకుంటున్నారో ఏమో కానీ వైసిపి నేతల ఆలోచన సరళి మాత్రం చాలా దారుణంగా ఉంటోంది. అనేకచోట్ల ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడం గుంపులుగుంపులుగా నిలబడడం…. పుట్టినరోజులు వేడుకలు లాంటి వాటిని జాగ్రత్తలు తీసుకోకుండా జరిపించడం చూస్తుంటే వీరంతా కలిసి ఏపీని మరింత ప్రమాదకర పరిస్థితికి నెట్టేలా ఉన్నారు…. లేదా ఇప్పటికే నెట్టేశారు అంటారా?