ఎమ్మెల్యే అయిన ప్రతీ నాయకుడి కలల హోదా.. కేబినెట్ కుర్చీ! ఈ విషయంలో చాలా మంది పగటి కలలు కంటుంటే, మరికొందరు పనిచేసుకుంటూ పోతుంటే, మరికొందరు అధినేత కళ్లల్లో పడితే సరిపోతుందని ఆ ప్రయత్నాలు చేస్తుంటే, ఇంకొందరైతే తాజాగా పూజలు చేయడం మొదలుపెట్టారంట. మంత్రి పదవి కదా… ఎన్ని పూజలు చేసినా, ఎన్ని మంత్రించిన తాయత్తులు కట్టుకున్నా పర్లేదులే… ఆ హోదా అలాంటిది మరి అని వినిపిస్తున్న కామెంట్ల సంగతి అటుంచితే.. అసలు ఎవరా మంత్రి, ఏమిటా కథ అనేది ఇప్పుడు చూద్దాం!
ప్రతి వర్గానికి, ప్రతి జిల్లాకు న్యాయం చేస్తూ 25మందితో కెబినెట్ ఏర్పాటుచేసుకుని పాలనసాగిస్తున్నారు సీఎం జగన్! ఈ కేబినెట్ రెండున్నర ఏళ్ల వరకే అని, ఆ సమయానికి పనితీరు బాగోని వారిని పక్కనబెట్టి కొత్తవారికి అవకాశం కల్పిస్తానని ముందుగానే జగన్ తనదైన క్లారిటీ ఇచ్చిన సంగతీ తెలిసిందే. దీంతో… మంత్రులంతా తెగ కష్టపడి పనిచేసేస్తున్నారని అంటున్నారు. ఆ సంగతులు అలా ఉంటే… పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకట రమణ లు రాజ్యసభకు వెళ్లిన సమయంలో.. వారు ఖాళీ చేసిన మంత్రిపదవులతో పాటు మరికొన్నింటిని జగన్ భర్తీ చేయాలని ఆలోచిస్తున్నారని కథనాలు రావడంతో.. ఆశావహులు రెడీ అయిపోతున్నారు.
ఇందులో భాగంగా… అన్ని జిల్లాలకు రెండేసి పదవులు వచ్చి, అనంతపురం జిల్లాలో ఒక మంత్రి పదవే రావడంతో మిగతా నేతలు ఎవరి ప్రయత్నాల్లో వారు ఉన్నారట. పెనుగొండకు చెందిన మాలగుండ్ల శంకర నారాయణకు జగన్ కేబినెట్ లో చోటు దక్కిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే నెక్స్ట్ టర్మ్ మంత్రి పదవి దక్కించుకునేందుకు ప్రభుత్వ విప్, రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి సీరియస్ గా ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఈయన ప్రయత్నాలకు తోడుగా.. అనుచరులతో కలిసి బలంగా పూజలు కూడా చేస్తున్నారట! కుటుంబ సభ్యులు కూడా దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారని తెలుస్తోంది.
కాగా… 2009 ఎన్నికల్లో రాయదుర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచిన కాపు రామచంద్రా రెడ్డి… వైఎస్ మరణానంతరం ఎమ్మెల్యే పదవికి, కాంగ్రెస్ పార్టీకు రాజీనామా చేసి వైసీపీలోకి వెళ్ళి 2012 ఉపఎన్నికల్లో మళ్ళీ గెలిచారు. అయితే 2014 ఎన్నికల్లో టీడీపీ సీనియర్ నేత కాల్వ శ్రీనివాసులుపై ఓడిపోయిన ఆయన.. 2019 ఎన్నికల్లో అదే కాల్వపై 14 వేల మెజారిటీతో గెలిచారు. నియోజకవర్గంలో కూడా బాగానే పనిచేసుకుపోతున్నారంట. దీంతో… ఆయనలోనూ, అనుచరుల్లోనూ మంత్రిపదవిపై ఆశలు పెరుగుతున్నాయి!