పెనమలూరు వైసిపి శాసనసభ్యుడు కె పార్థసారధి తండ్రి మాజీ ఎంపీ కెపీ రెడ్డయ్య జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పర్యటనకు హాజరై ఆయనకు రైతు సమస్యల గురించి వివరించటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. కృష్ణా జిల్లాలో తుఫాను తాకిడికి గురైన ప్రాంతాలలో పవన్ కల్యాణ్ బుధవారం పర్యటిస్తుండగా కేపీ రెడ్డెయ్య పామర్రు వద్ద పవన్ కల్యాణ్ని కలిశారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను రెడ్డయ్య వివరించారు.ఈ పరిణామం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.ఏపీ రెడ్డయ్య గతంలో శాసనసభ్యుడిగాను, మచిలీపట్నం ఎంపీ గానూ పనిచేశారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది.ప్రస్తుతం ఆయన కుమారుడు పార్థసారధి వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆ పార్టీలో చురుకుగా ఉంటున్నారు.
జగన్ పై ఈగ వాలనీయకుండా ప్రతిపక్షాలపై ఒంటికాలిమీద పార్థసారధి లేస్తుంటారు.వచ్చే ఏడాది జరిగే మంత్రివర్గ విస్తరణలో పార్థసారథికి బీసీ కోటాలో స్థానం లభించవచ్చుననే ఊహాగానాలు కూడా ఉన్నాయి.గతంలో కాంగ్రెస్ హయాంలో పార్థసారధి మంత్రిగా ఉన్నారు.జగన్ తొలి కేబినెట్లోనే ఆయనకు స్థానం లభించాల్సి ఉన్నప్పటికీ కొన్ని ఈక్వేషన్స్ కారణంగా నెల్లూరు జిల్లాకు చెందిన అనిల్ కుమార్ యాదవ్ ఆ పదవిని దక్కించుకున్నారు. రేపటి క్యాబినెట్ ఎక్స్పాన్షన్లో మాత్రం పార్థసారథికి ఎక్కువ అవకాశాలున్నాయని అందరూ భావిస్తున్నారు.ఈ నేపధ్యంలో ఆయన తండ్రి రెడ్డయ్య రాష్ట్రంలో ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ను కలుసుకోవడం అనేది సహజంగానే చర్చకు దారితీసింది.
రెడ్డయ్య రైతు సమస్యలపై పోరాడుతుంటారన్నది వాస్తవమే అయినప్పటికీ రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసిపి పార్టీకి చెందిన తన కుమారుడు పార్థసారధి ద్వారా జగన్ ప్రభుత్వానికి రైతు సమస్యలను విన్నవించాల్సింది పోయి వైసీపీకి బద్ధ శత్రువైన పవన్ కల్యాణ్ దగ్గరకుపోవటం అనేది ఆసక్తికరంగా మారింది.పార్థసారథి ద్వారా కాకుంటే అసలు మాజీ ఎంపీ హోదాలో ఆయనే కూడా ప్రభుత్వానికి వినతిపత్రాలు పంపుకోవచ్చు.అవేమీ చేయకుండా రెడ్డయ్య నేరుగా పవన్ కళ్యాణ్ ని ఎందుకు కలిశారన్నది వైసిపి లోనే చర్చకు దారి తీసింది.తండ్రి కొడుకులకు పొసగని నేపధ్యంలోనే రెడ్డయ్య తనదారి తాను చూసుకున్నారా అన్న ప్రశ్న ఉత్పన్నం అవుతోంది.మొత్తానికి ఈ పరిణామం మంత్రి పదవి ఆశిస్తున్న ఎమ్మెల్యే పార్థసారధికి కొద్దిగా ఇబ్బందికరమేనని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.