RRR: వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు విషయంలో ఆ పార్టీ నాయకత్వం అన్ని అస్త్రశస్త్రాలను ప్రయోగిస్తోంది.ఒకవైపు అనర్హత వేటు వేయించడం తో పాటు వీలైతే పెద్ద క్రిమినల్ కేసులో అరెస్ట్ చేయించాలన్న వ్యూహాన్ని కూడా పన్నినట్లు కనిపిస్తోంది. పనిలో పనిగా వైసీపీకి వ్యతిరేకంగా ఉన్న టీవీ5 న్యూస్ ఛానెల్ ని కూడా వారు టార్గెట్ చేశారు. సోమవారం చోటు చేసుకున్న పరిణామం ఈ ఊహాగానాలకు బలం ఇస్తోంది.పదిహేను మంది వైసిపి ఎంపీలు నేరుగా ప్రధానిని కలిసి రఘురామకృష్ణంరాజు పై తీవ్రమైన అభియోగాలు మోపుతూఫిర్యాదు చేశారు.వైసీపీ అగ్రనేత విజయసాయిరెడ్డి ఈ ఎంపీల బృందానికి నాయకత్వం వహించారు.మరోవైపు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ని కూడా వారు కలిసి రఘురామకృష్ణంరాజు దేశం విడిచి వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.
ఎంపీల ఫిర్యాదు సారాంశమేంటంటే?
నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు, టీవీ5 ఛైర్మన్ బీఆర్ నాయుడుపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ప్రధాని నరేంద్ర మోడీకి ఫిర్యాదు చేశారు. వారిద్దరి మధ్య హవాలా లావాదేవీలు జరిగినట్లు వైసిపి ఎంపీలు తెలిపారు. వారిద్దరి మధ్య మిలియన్ యూరోల బదిలీ జరిగినట్లు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఆరోపించారు. మనీలాండరింగ్, ఫెమా చట్టాల కింద విచారణ జరపాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు.రఘురామ కృష్ణంరాజు, నాయుడులను కస్టడీలోకి తీసుకోవాలని, అక్రమ లావాదేవీల గుట్టు బయటకు తీయాలని వైసీపీ ఎంపీలు కోరారు.అయితే రఘురామకృష్ణంరాజు సబ్జెక్ట్ ఒక్కటే అయితే బాగుండదనుకున్నారేమో రాష్ర్టానికి ప్రత్యేక హోదా,పోలవరం ప్రాజెక్టుల గురించి కూడా ప్రధానికి వారు కొన్ని విజ్ఞప్తులు చేశారు.కాని ప్రధాని నుండి ఏ విధమైన స్పందన వచ్చిందో మాత్రం తెలియడం లేదు.
అదంతా విజయసాయిరెడ్డి విషప్రచారం!
మరోవైపు విజయసాయి రెడ్డి నేతృత్వంలోని వైసీపీ ఎంపీలు చేసిన ఆరోపణలు, ఫిర్యాదుల మీద రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు స్పందిస్తూ అదంతా విష ప్రచారమని పేర్కొన్నారు. తాను విదేశాలకు వెళ్లకుండా చూడాలంటున్నారని,మరి 20 కేసులున్న విజయసాయి రెడ్డి విదేశాలకు వెళ్లొచ్చా? అని ఆయన ప్రశ్నించారు.తాను కూడా ఏవన్,ఏటు(జగన్ ,విజయసాయిరెడ్డి)ల అవినీతి బాగోతాలను వివరిస్తూ ప్రధానికి లేఖ రాసినట్లు రఘురామ కృష్ణంరాజు చెప్పారు.వారిద్దరి డొల్ల సూట్ కేసు కంపెనీల వివరాలన్నీ ప్రభుత్వానికి నివేదించానని, ముందుగా వారిద్దరి పైన చర్యలు తీసుకోవాలని ప్రధానిని కోరానన్నారు. ఇలాంటి ఉడత ఊపులకు తాను బెదరబోనని రఘురామకృష్ణం రాజు స్పష్టం చేశారు.