(న్యూఢిల్లీ నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)
తిరుపతి పార్లమెంట్ సభ్యుడు బల్లి దుర్గప్రసాద్ అకాల మృతికి వైసీపీ పార్లమెంట్ సభ్యులు నివాళలర్పించారు. ఏపి భవన్లోని అంబేద్కర్ ఆడిటోరియంలో నేడు బల్లి దుర్గాప్రసాద్ సంతాప సభను వైసీపీ పార్లమెంట్ సభ్యులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
బుల్లి దుర్గప్రసాద్ 28ఏళ్లకే రాజకీయ జీవితంలో ప్రవేశించి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారనీ ఎంపి మాగుంట శ్రీనివాసులు రెడ్డి అన్నారు. దుర్గాప్రసాద్తో ఆయనకు ఉన్న వ్యక్తిగత అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. పార్లమెంట్లో అందరితో కలుపుగోలుగా ఉండేవారనీ, ఎవరు ఏ సహాయం అడిగినా వెంటనే సిద్ధంగా ఉండేవాడని కొనియాడారు. సహచర ఎంపి దుర్గాప్రసాద్ మరణం తమను ఎంతో బాధించిందని ఎంపిలు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో వైసీపీ ఎంపిలు విజయసాయిరెడ్డి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి, సత్యవతి, గోరంట్ల మాధవ్, పోచ బ్రహ్మానందరెడ్డి, లావు శ్రీకృష్ణదేవరాయలు, అయోధ్య రామిరెడ్డి, బెల్లాల చంద్రశేఖర్, తలారి రంగయ్య, ఏపి భవన్ ప్రిన్సిపల్ రెసిడెంట్ కమిషనర్ అభయ్ త్రిపాఠీ, రెసిడెంట్ కమిషనర్ భావన సక్సెనా, స్పెషల్ కమిషనర్ ఎన్ వి రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
బల్లి దుర్గాప్రసాద్ కరోనా వ్యాధి సోకి అస్వస్థతకు గురై చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం తెలిసిందే.