ప్రతిపక్షంలో ఉన్నసమయంలో అసెంబ్లీలోనూ బయటా కూడా జగన్ పోరాటాలకు బలమైన సహకారం అందించిన నేతల్లో నగరి ఎమ్మెల్యే రోజా ఒకరు! క్యాస్ట్ ఈక్వేషన్స్ కలిసిరాలేదు కానీ… లేదంటే “ఆర్కే రోజా అనే నేను” అంటూ అమాత్యులు కూడా అయిపోయేవారే! దీంతో తనకు అనుకూలంగా ఈక్వేషన్స్ రాలేదనో లేక తన కష్టానికి తగిన ప్రతిఫలం రాలేదనో తెలియదు కానీ… రోజా అలిగారు! ఎంతలా అంటే… మంత్రుల ప్రమాణస్వీకారానికి కూడా హాజరుకాలేనంత!! ఆ సంగతులు అలా ఉంటే… ఇప్పుడు రోజాకు మరో సమస్య వచ్చి పడింది!
మంత్రిపదవి దక్కకపోవడంతో అలకబూనిన ఆర్కే రోజాను “ఏపీఐఐసీ ఛైర్మన్” పదవి ఇచ్చి కూల్ చేశారు జగన్! నాటి నుంచి ఆ పదవి, నగరి నియోజకవర్గం విషయాలతో ఫుల్ బిజీ అయిపోయారు రోజా. ఈ క్రమంలో తాజాగా తన నియోజకవర్గంలోని తన వ్యతిరేఖ వర్గంతో వైకాపాలోని కొందరు పెద్దలు రాసుకుపూసుకుని తిరుగుతూ తనకు ఇబ్బందులు కలిగిస్తున్నారని ఫీలవుతున్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే అధినేత జగన్ కు కూడా చేరవేశారని సమాచారం!
రోజా నియోజకవర్గంపై ఆ జిల్లా మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, నారాయణ స్వామి ల పెత్తనం బాగ పెరిగిపోతుందని రోజా గతకొంతకాలంగా బహిరంగంగానే చెబుతున్న సంగతి తెలిసిందే. మంత్రి నారాయణస్వామి ఇటీవల తన నియోజకవర్గంలో తనకు తెలియకుండా కలెక్టర్ తో కలసి పర్యటించడం, నగరి నియోజకవర్గ విషయాల్లో పెద్దిరెడ్డి కూడా ప్రముఖంగా కల్పించుకోవడం వంటి విషయాలు తెలిసినవే!
దీంతో తనదైన శైలిలో స్పందిస్తోన్న రోజా… మంత్రులెవరూ తన నియోజకవర్గానికి రాకపోయినా పరవలేదు కాని.. వచ్చి ఇలా తనను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయవద్దని చెబుతున్నారట. ఇదే క్రమంలో.. తనకు తెలియకుండా నగరికి వస్తే మాత్రం ఊరుకోబోనని కూడా మంత్రులకు హెచ్చరిక పంపారన్న టాక్ వినిపిస్తోంది!! రోజా అన్నారని కాదు కానీ… ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నాడూ ఇబ్బందులు పడి, అధికారంలోకి వచ్చాక నేడూ ఇంటర్నల్ గా ఇబ్బందులు పెడితే రోజాకు మాత్రం కాలదా అనే కామెంట్లు ఆన్ లైన్ వేదికగా ఈ సందర్భంగా పడుతున్నాయి!