YSRCP: రాజకీయాల్లో అనేక కీలక పరిణామాలు చోటుచేసుకుంటుంటాయి. పలు సందర్భాల్లో పరిశీలకులకు ఊహలకు అందని నిర్ణయాలు జరుగుతుంటాయి. ట్విస్ట్ లు ఉంటాయి. ప్రస్తుతం వైసీపీలో ఎవరూ ఊహించని పరిణామాలు జరిగే అవకాశం ఉందన్నట్లు వార్తలు వినబడుతున్నాయి. ఇది గాసిప్ కూడా అయి ఉండవచ్చు. త్వరలో నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్న సంగతి తెలిసిందే. వైసీపీ నుండి రాజ్యసభకు ఎన్నికైన విజయసాయిరెడ్డి, టీడీపీ నుండి ఎన్నికై బీజేపీలో విలీనం అయిన సుజనా చౌదరి, టీజీ వెంకటేష్, కేంద్ర మంత్రి సురేష్ ప్రభుల పదవీ కాలం ఈ ఏడాది జూన్ తో ముగియనుంది. ఖాళీ అవుతున్న ఈ నాలుగు స్థానాలు ఏపి అసెంబ్లీలో ఉన్న సంఖ్యా బలం కారణంగా వైసీపీకే దక్కనున్నాయి.
YSRCP: విజయసాయిరెడ్డికి మళ్లీ రాజ్యసభ రెన్యువల్..?
ఖాళీ అవుతున్న ఈ నాలుగు స్థానాలకు వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి ఎవరిని పంపుతారు అనేది, ఆ పదవులు ఎవరికి వరించనున్నాయి అనేది ఇంకా క్లారిటీ అయితే లేదు కానీ వీటిపై అనేక వదంతులు వినబడుతున్నాయి. విజయసాయిరెడ్డికి మళ్లీ రాజ్యసభ ను రెన్యువల్ చేయాలని వైఎస్ జగన్ భావిస్తున్నారుట. అయితే విజయసాయి రెడ్డి మరో పక్క ఉత్తరాంధ్ర పార్టీ ఇన్ చార్జి గానూ బాధ్యతలు నిర్వహిస్తున్నందున రాబోయే ఎన్నికల్లో విశాఖ పార్లమెంట్ స్థానం నుండి పోటీ చేయాలని అనుకుంటున్నారుట. ప్రజా బలంతో ఎన్నికై ఉత్తరాంధ్రలో తన సత్తా ఏమిటో చూపాలని భావిస్తున్నారనేది టాక్. అయితే విజయసాయిరెడ్డి రాజ్యసభ సభ్యుడుగా ఉండటం వల్ల ఢిల్లీలో పార్టీ తరపున చక్రం తిప్పుతున్నారు.
ఒక వేళ విజయసాయిరెడ్డి రాజ్యసభకు మరో సారి వెళ్లకుండా ఉత్తరాంధ్ర క్రియాశీల రాజకీయాలకే పరిమితం కావాలని భావిస్తే ఢిల్లీలో ఆయన స్థానాన్ని భర్తీ చేయడానికి సరైన నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి యేనని సీఎం జగన్ యోచిస్తున్నారని తాడేపల్లి వర్గాలు అంటున్నాయి. ప్రస్తుతం సజ్జల ప్రభుత్వ సలహాదారుగా, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కీలక భూమికను పోషిస్తున్నారు. ప్రతిపక్షాల విమర్శలకు కౌంటర్ లు ఇవ్వడంతో పాటు అనేక ప్రభుత్వ వ్యవహారాలను చూస్తున్నారు. అయితే ప్రతి అంశంలోనూ సజ్జల జోక్యంపై ప్రతిపక్షాలు ఆయనను సకల శాఖల మంత్రి అంటూ వ్యంగ్యంగా విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ విమర్శలకు చెక్ పెట్టాలంటే సజ్జలను రాజ్యసభకు పంపిస్తే బాగుంటుందని సీఎం జగన్ భావిస్తున్నారని అంటున్నారు. ఈ వార్తలు నిజమో కాదో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.