YSRCP : ఇటీవల జాతీయ ఛానల్ రిపబ్లిక్ టీవీ లో వైఎస్ఆర్ సీపీ YSRCP లో అంతర్గత కలహాలు ఉన్నాయంటూ వచ్చిన కథనం ఎంతో సంచలనం సృష్టించింది. ఈ కథనం వచ్చిన తర్వాత వైయస్సార్సీపి నుంచి సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్ పెట్టి రిపబ్లిక్ టీవీ లో వచ్చిన కథనానికి ఎలాంటి విశ్వసనీయత లేదని, పార్టీలో అంతా బాగున్నప్పుడు కావాలని టిడిపి కు అనుకూలంగా ఇలాంటి కథనాలు వేస్తున్నారు
అంటూ మండిపడటమే కాకుండా, సదరు ఛానల్ మీద లీగల్గా ప్రొసీడ్ అవుతాను అంటూ చెప్పుకొచ్చారు. అంత వరకు బాగానే ఉన్నా… దాని తర్వాత కొందరు నేతలు చేస్తున్న వ్యాఖ్యలు కొత్త అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. వైయస్సార్సీపి లో ముఖ్యంగా ముఖ్యమంత్రి జగన్ కు వెనకాల ఏదో జరుగుతుంది అన్న అనుమానాలు రేకెత్తిస్తున్నాయి.
ఈ నేతల మాటలు పట్టించుకోవచ్చా??
రిపబ్లిక్ టీవీ కథనం మీద సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్మీట్ అనంతరం నరసాపురం ఎంపీ వైఎస్ఆర్సిపి రెబెల్ నేత రఘురామకృష్ణంరాజు యధావిధిగా ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి ఆ కథనాన్ని తేలిగ్గా తీసుకోవద్దని, జగన్కు ఆంతరంగికుడు నమ్మక ద్రోహం చేసే అవకాశం ఉందని చెప్పడం కొంత అయోమయానికి దారితీసింది. గత కొంతకాలంగా పార్టీ వ్యతిరేక లైన్లో వెళ్తున్నా ఎంపీ రఘురామకృష్ణంరాజు మాటలను చాలా మంది వైఎస్సార్సీపీ నేతలు పట్టించుకోలేదు.
ఆయనతో కావాలనే టిడిపి శక్తులు మాట్లాడుతున్నా అన్న రీతిలో కొట్టిపడేశారు. అయితే బుధవారం పోలింగ్ రోజున నగిరి ఎమ్మెల్యే, వైయస్ఆర్సీపీ ఫైర్ బ్రాండ్ రోజా సైతం ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు రిపబ్లిక్ టీవీ కథనాలకు ఊతమిస్తోంది. ఆమె కూడా మీడియాతో మాట్లాడుతూ వైఎస్ఆర్సిపిలో కొందరు నేతలు జగన్ కు వెన్నుపోటు పొడవాలని చూస్తున్నారని, ముఖ్యమంత్రి జాగ్రత్తగా ఉండాలని ఆమె చెప్పడం చూస్తే పార్టీలో ఏదో జరగడంతో పాటు, ముఖ్యమంత్రి జగన్ మీద కొందరు గురి పెట్టారు అని అర్థమవుతోంది.
టార్గెట్ పెద్దిరెడ్డి!
రిపబ్లిక్ టీవీ కథనాల తర్వాత మొత్తం ఒక సొంత వైయస్ఆర్సిపి సీనియర్ నాయకుడు పెద్ద రెడ్డి రామచంద్రారెడ్డి మీద చాలా మంది కేంద్రీకరించారు. ముఖ్యంగా టిడిపి, జనసేన సోషల్ మీడియా విభాగాలు రకరకాల మీమ్స్ లో పెద్దిరెడ్డి వాళ్లనే జగన్ కుర్చీ కు ప్రమాదం అనే రీతిలో కొన్ని పోస్టులు క్రియేట్ చేసి సర్క్యులేట్ చేశారు. గతంలోనూ ఓ తెలుగు ఛానల్ లో పెద్దిరెడ్డి కొందరు ఎమ్మెల్యేలను తన వైపు తిప్పుకొని, ప్రభుత్వాన్ని కూలదోయడానికి చూస్తున్నారని కథనాలు వచ్చాయి. ఇప్పుడు రిపబ్లిక్ టీవీ కథనం తర్వాత ఇలాంటి ప్రచారమే మళ్లీ జరగడం తో అందరిచూపు చిత్తూరు జిల్లా సీనియర్ నాయకుడు పెద్దిరెడ్డి వైపే వెళుతోంది. అందులోనూ చంద్రబాబు వైయస్సార్ తో సమకాలికుడు గా, ఆర్థికంగానూ మంచి పట్టు ఉన్న పెద్ద రెడ్డి ఇలాంటి చర్యలకు పాల్పపడతారా లేదా అనేది పక్కన పెడితే ప్రచారం మాత్రం ఎక్కువగానే ఉంది.
రోజా వ్యాఖ్యలు కీలకం
చిత్తూరు జిల్లా రాజకీయాల్లో రోజా ఎదుగుదలకు ప్రధాన అవరోధం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తో పాటు ఒక ముఖ్య మంత్రి నారాయణ స్వామి అని బలమైన ప్రచారం ఉంది. ఆమెకు అడుగడుగునా రాజకీయ అవరోధాలు సృష్టించడంతో పాటు, సొంత నియోజకవర్గంలోనూ వేరు కుంపటి పెట్టించడం లో ఈ ఇద్దరు నేతలు కీలకంగా వ్యవహరించారు అనేది రోజా అనుమానం. అంతగా బలం లేని ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి మీద రోజా తన కోపాన్ని బహిరంగంగా వ్యక్తం చేసినప్పటికీ, పెద్దిరెడ్డి మీద అలా చేసేందుకు ఆమె సహించలేదు.
అయితే ఆయనకు ఏదో రకంగా ఎర్త్ పెట్టాలని మాత్రం భావించే ఆమె, రిపబ్లిక్ టీవీ కథనాల తర్వాత వచ్చిన ప్రచారాన్ని మరింత బలం చేకూర్చేందుకు తమ పార్టీలోని వారే jagan కు వెన్నుపోటు పొడవాలని చూస్తున్నారంటూ వ్యాఖ్యలు చేసి ఉంటారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఏది ఏమైనా 151 సీట్లు గెలుచుకున్న వైఎస్ఆర్ సీపీ అధినేత జగన్ కు పూర్తి ప్రజాబలం ఉంది. ఆయన ఎలాంటి సమస్యనైనా దీటుగా ఎదుర్కోగల నేత. జగన్ మొండితనం, ఆయన రాజకీయ ఆలోచనలు దగ్గరనుంచి గమనించే నేతలు ఇంతటి సహసం చేసే అవకాశమే లేదు అన్నది వైఎస్ఆర్సీపీ నేతల మాట.