(న్యూస్ ఆర్బిట్ ప్రత్యేక ప్రతినిధి)
ఎంతో పేరున్న విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని 30 ఏళ్ల పాటు మూసేయాలని, దీనికి ప్రతిగా భోగాపురం ఎయిర్పోర్ట్ లో తాము వాడుకుంటామని ఎంపీ విజయసాయిరెడ్డి సివిల్ ఏవియేషన్ మంత్రికి లేఖ రాయడం అది సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా వైరల్ అవ్వడం ఇప్పుడు వైస్సార్సీపీ మెడకు చుట్టుకుంటోంది. దీనిపై విశాఖ వాసులు లో వస్తున్న వ్యతిరేకత ఆ పార్టీ నేతలను చుట్టుముడుతోంది. భోగాపురం విమానాశ్రయానికి ఒక రాయి కూడా పడకుండానే అప్పుడే వైజాగ్ విమానాశ్రయాన్ని మూసేయాలని లేఖ రాయడం వివాదం అవుతోంది. ఉత్తరాంధ్ర వైఎస్ఆర్సిపి బాధ్యతలు చూస్తున్న విజయసాయిరెడ్డి ఎలా ఎందుకు వ్యవహరించారో దీనిలో తొందర ఏముందో అని ఉత్తరాంధ్ర వైఎస్ఆర్ సీపీ నేతలు ఈ విషయాన్ని జగన్మోహన్రెడ్డి స్థితికి తీసుకు వెళ్లినట్లు సమాచారం. దీనివల్ల విశాఖలో గాని ఉత్తరాంధ్రలో గాని విపరీతంగా వ్యతిరేకత పెరుగుతుంది తప్ప ప్రయోజనం ఉండబోదని వారు జగన్ కు వివరించారు.
విస్తరించి.. విస్మరిస్తారా?
విశాఖ విమానాశ్రయానికి మొదట్లో కేవలం ఒక టెర్మినల్ మాత్రమే ఉండేది. ఆ తరువాత ఇరవై వేల చ.మీ. విస్తీర్ణంలో కొత్త టెర్మినల్ నిర్మించి, పాత భవనాన్ని కార్గోకు కే టాయించారు. ఇప్పుడు ప్రయాణికుల సంఖ్య ఇంకా పెరగడంతో టెర్మినల్ భవనాన్ని మరో పది వేల చ.మీ.కు విస్తరిస్తున్నారు. రాష్ట్రంలోనే ఒకే ఒక అంతర్జాతీయ విమానాశ్రయం వైజాగ్ లోనే ఉంది. దాదాపు పది దేశాలకు పైగా ఇక్కడి నుంచి విమానాలు వెళ్తాయి.
రాత్రి అయితే విమానం దిగేది కాదు..
2007 చివరి వరకు విశాఖకు చీకటి పడితే విమానాలు వచ్చేవి కావు. దీనిపై నేవీతో పోరాడి మార్చి, 2008లో నైట్ ల్యాండింగ్ (ఇన్స్ట్రుమెంట్ ల్యాండింగ్ సిస్టమ్) సాధించారు. అప్పటి నుంచి రాత్రి వేళ కూడా విమానాలు వచ్చి వెళుతున్నాయి. దీనికి అప్పట్లో రాజ్యసభ సభ్యుడు టి.సుబ్బిరామిరెడ్డి కృషిచేశారు. అంతర్జాతీయ విమానాలు రావాలంటే…రాత్రి 11 గంటల తరువాత కూడా విమానాశ్రయం తెరిచి ఉంచాలి. దానికి తగిన సిబ్బంది లేరని నేవీ అనుమతించలేదు. సింగపూర్ విమానాలు వస్తాయని ఆసక్తి చూపడంతో నాటి విశాఖ ఎంపీ, కేంద్ర మంత్రి పురందేశ్వరి రక్షణ శాఖతో మాట్లాడి 24/7 విమానాశ్రయం నడపడానికి 400 మంది సిబ్బందిని మంజూరు చేయించారు. రాత్రిపూట వచ్చే విమానాలు వెంటనే తిరిగి వెళ్లిపోకుండా రాత్రికి ఇక్కడే పార్కింగ్ చేసుకునే తెల్లవారుజామున బయలుదేరే సౌకర్యం ఉండేది కాదు. దీనికి నైట్ పార్కింగ్ అవసరమని గత ఎంపీ హరిబాబు కేంద్రంతో మాట్లాడి నిధులు సాధించి పార్కింగ్ బేలు నిర్మించారు.
ఇలా ఒక్కొక్క సౌకర్యం సాధించుకొని విమానాశ్రయం అభివృద్ధి చెందుతుంటే…దానిని మూసేయాలని విజయసాయిరెడ్డి డిమాండ్ చేయడాన్ని విశాఖ పారిశ్రామిక వర్గాలు, ప్రయాణికుల సంఘాలు, ప్రజా సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. దింతో ఈ విషయం సీరియస్ అయ్యేవరకు, తీసుకు వెళ్లడం సబబు కాదని వెంటనే నివారణ చర్యలకు వైఎస్ఆర్సిపి నాయకులు దిగారు. అందులోనూ పరిపాలన రాజధానిగా విశాఖను పెట్టుకుందాం అన్న ముఖ్యమంత్రి తీరుకు భిన్నంగా విజయసాయిరెడ్డి ఇలా చేయడాన్ని వైఎస్ఆర్ సీపీ నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ లేఖ విషయాన్ని మరుగున పెట్టేందుకు వైఎస్సార్సీపీ నేతలు శతవిధాల ప్రయత్నిస్తున్నారు. విశాఖ పారిశ్రామికవేత్తలకు అలాంటిదేమీ ఉండదని జగన్ ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తారని సర్ది చెబుతున్నారు.