అమరావతి: మహిళల భద్రత కోసం ఏపీ ప్రభుత్వం ‘ఏపీ దిశ యాక్ట్’ పేరిట చరిత్రాత్మక చట్టాన్ని తీసుకొచ్చిన నేపథ్యంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి మహిళా మంత్రులు, ఎమ్మెల్యేలు రాఖీ కట్టి ధన్యవాదాలు తెలిపారు. గురువారం సచివాలయంలోని సీఎం చాంబర్లో వైఎస్ జగన్ను డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి, హోంమంత్రి సుచరిత, మంత్రి తానేటి వనిత, ఏపీఐఐసీ చైర్మన్ రోజాతోపాటు మహిళా ఎమ్మెల్యేలు కలిశారు.
మహిళలపై లైంగిక దాడులకు పాల్పడితే 21 రోజుల్లోనే విచారణ జరిపి.. తీర్పు ఇచ్చేలా చారిత్రాత్మక ముసాయిదా బిల్లుకు ఏపీ మంత్రివర్గం బుధవారం ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ క్రిమినల్ లా (సవరణ) చట్టం–2019 (ఆంధ్రప్రదేశ్ దిశ యాక్ట్)ను తీసుకురావాలని సీఎం వైఎస్.జగన్ అధ్యక్షతన సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారు. ఈ చట్టంలో భాగంగా మహిళలు, చిన్నారులపై నేరాల విచారణకు ప్రతి జిల్లాకు స్పెషల్ కోర్టులు ఏర్పాటు చేస్తారు. మహిళలు రక్షణ కోసం కొత్త చట్టం తీసుకొస్తామని అసెంబ్లీలో సీఎం జగన్ ఇచ్చిన హామీకి అనుగుణంగా ‘ఏపీ దిశ’ చట్టాన్ని రూపొందించారు. దీనిపై ఏపీ మహిళలు హర్హం వ్యక్తం చేస్తున్నారు.