అమరావతి: ప్రత్యేక హోదా, విభజన హామీలు సాధించుకునేలా పార్లమెంట్ సభ్యులు ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలని ముఖ్యమంత్రి, వైసిపి అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి సూచించారు. ఈ నెల 17వ తేదీ నుండి ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశాలను పురస్కరించుకొని నేడు ఢిల్లీలోని ఎపి భవన్లో వైఎస్ఆర్సిపి పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సభ్యులు అనుసరించాల్సిన వ్యూహంతో పాటు ప్రత్యేక హోదాపై ఉభయసభల్లో అవలంబిచాల్సిన విధానంపై సిఎం జగన్ పార్టీ లోక్సభ, రాజ్యసభ సభ్యులకు పలు సూచనలు చేశారు.
పార్లమెంట్లో వైసిపి నాల్గవ అతి పెద్ద పార్టీగా ఉందని గుర్తు చేస్తూ దీన్ని ఒక అవకాశంగా భావించాలని జగన్ అన్నారు. సంఖ్యాబలాన్ని సమర్థవంతంగా వినియోగించుకొని ప్రత్యేక హోదా, విభజన హామీలను సాధించుకోవాలని జగన్ సూచించారు. సభా కార్యక్రమాల్లో ఆంధ్రప్రదేశ్ ఎంపిల గౌరవం పెరిగేలా హుందాగా వ్యవహరించాలని సూచించారు. పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి, లోక్సభ ప్లోర్ లీడర్ మిథున్ రెడ్డి సలహాలు, సూచనలతో సభా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని జగన్ దిశానిర్దేశం చేశారు.