(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
గుంటూరు జిల్లాలోని నాగార్జునా యూనివర్శిటీ ప్రాంగణంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేయడాన్ని టీడీపీ తప్పుబట్టింది. సీఎం జగన్ పిచ్చికి హద్దు లేకుండా పోయిందని టీడీపీ నేత, మాజీ మంత్రి నారా లోకేశ్ విమర్శించారు. విశ్వవిద్యాలయంలో వైఎస్ఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టారు. “ప్రతి పిచ్చికీ ఓ పద్ధతుంటుంది. కానీ, జగన్ పిచ్చికి మాత్రం అది ఉన్నట్టు కనిపించడం లేదు. నాగార్జునా విశ్వవిద్యాలయంలో వైఎస్ఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని అనుకోవడం అధికారాన్ని దుర్వినియోగం చేయడమే” అని లోకేశ్ పేర్కొన్నారు.
There is always a method to madness, but there seems none to @ysjagan's madness. YSR’s Statue popping up on the campus of Nagarjuna University is yet another example of mis-utilizing power to push the agenda of self-glorification. Appalling! pic.twitter.com/yT4aR9adrw
— Lokesh Nara (@naralokesh) November 27, 2019
ఇటీవల కాలంలో పంచాయతీ ఆఫీసులు మొదలుకొని ప్రతి నిర్మాణానికి వైఎస్ఆర్సీపీ రంగులు వేస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని అన్ని పంచాయతీ ఆఫీసులకు వైఎస్ఆర్సీపీ పార్టీ కలర్ వేసి, జగన్ ఫొటో ఉంచారు. దీంతో పంచాయతీ ఆఫీసులను పార్టీ ఆఫీసుల్లా మార్చేస్తున్నారేంటని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. తాజాగా యూనివర్శిటీ ప్రాంగణంలో వైఎస్ఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం వివాదాస్పదమైంది.