YV Subba Reddy: టీటీడీ చైర్మన్ పదవిని ఇంకోసారి ఇచ్చినా తీసుకోవడానికి వైవీ సుబ్బారెడ్డి సిద్ధంగా లేరని వైసిపి వర్గాలు చెప్తున్నాయి.ఇప్పటికే ఆయన తన మనసులోని మాటను ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి చెప్పేశారని ఆ వర్గాలు అంటున్నాయి.అవటానికి పెద్ద హోదానే అయినప్పటికీ రాజకీయంగా ఎదగటానికి మాత్రం ఈ పదవిలో ఏమాత్రం అవకాశం లేదన్నది సుబ్బారెడ్డి మనోగతమని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.పైగా టీటీడీ చైర్మన్ గా ఉన్నందున కొన్ని రకాల రాజకీయ కార్యకలాపాలు సాగించడానికి కూడా వీలులేని పరిస్థితి ఆయనకు ఎదురవుతోంది.ఇంటి పేరు కస్తూరివారు..ఇంట్లో చూస్తే గబ్బిలాల కంపు అన్నట్లు తన పరిస్థితి ఉందని సుబ్బారెడ్డి ఫీలవుతున్నారట.
ఆదిలోనే అడ్జస్ట్ అయ్యారు!
సుబ్బారెడ్డికి ప్రత్యక్షరాజకీయాలంటే మోజు.ప్రజా ప్రతినిధిగా ఉండాలన్నది ఆయన కోరిక.2014 లో సుబ్బారెడ్డి ఒంగోలు లోక్సభ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఎంపీగా గెలుపొందారు.లోక్సభ సభ్యునిగా ఆ పదవిలో రాణించారు.2019 లో కూడా మళ్లీ ఎంపీగానే పోటీ చెయ్యాలని ఆయన ఆశించారు.అయితే కుటుంబ పరమైన కొన్ని రకాల సమస్యలు తదితర కారణాల వల్ల వైఎస్ జగన్మోహన్రెడ్డి బాబాయ్ సుబ్బారెడ్డికి ఒంగోలు టిక్కెట్ ఇవ్వలేదు.ఎన్నికలకు నెలరోజుల ముందు వైసిపిలో చేరిన మాగుంట శ్రీనివాసులురెడ్డికి ఒంగోలు లోక్సభ టికెట్ ఇవ్వగా ఆయన గెలుపొందారు.అప్పుడే సుబ్బారెడ్డి అలిగి కొన్నాళ్లు విదేశాలకు వెళ్లారు. లోటస్ పాండ్ వైపు కూడా తొంగి చూడలేదు.అయితే వైసిపి రాష్ట్రంలో అఖండ విజయం సాధించడం,ఆ తదుపరి పరిణామాల్లో కుటుంబసభ్యుల బుజ్జగింపు కారణంగా ఆయన మళ్లీ జగన్ కు చేరువయ్యారు.వెనువెంటనే ఆయనకు టీటీడీ చైర్మన్ పదవిని ఇవ్వడం జరిగింది. అయిష్టంగానే అప్పుడు కూడా ఆయన ఆ పదవిని తీసుకున్నారని వినికిడి. రెండేళ్ల పదవీకాలం ఉన్న టీటీడీ చైర్మన్ టెర్మ్ ముగియబోతోంది.మామూలుగా అయితే సుబ్బారెడ్డికి ఆ పదవిని మళ్లీ రెన్యూవల్ చేసే అవకాశాలు మెండు.
Read More: AP IAS Transfers: ఏపిలో భారీ ఎత్తున ఐఏఎస్ అధికారుల బదిలీలు…వివరాలు ఇవీ..
YV Subba Reddy: వద్దు మొర్రో అంటున్న వైవీ!
కాని వైసిపిలోని ఉన్నత స్థాయి వర్గాలు అందించిన సమాచారం మేరకు వైవీ సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్ పదవి రెన్యువల్ ని అంగీకరించడం లేదట.ఇప్పటికే రాజకీయంగా తాను వెనకబడిపోయానని ఆయన తన సన్నిహితుల వద్ద బాధ పడుతున్నారట.మళ్లీ ఈ పదవి తీసుకున్నా తనకు ఒరిగేదేమీ లేదని,ఉత్సవ విగ్రహంగా మిగిలిపోవటం తప్ప చేసేదేమీ ఉండదని ఆయన అంటున్నారట.ఇదే విషయాన్ని జగన్ కి కూడా సుబ్బారెడ్డి చెప్పుకుని తనను అవకాశం వచ్చినప్పుడు రాజ్యసభ కి పంపమని కోరారని లోటస్పాండ్ వర్గాల సమాచారం.ప్రస్తుతం శాసనసభలో వైసీపీ బలం ప్రకారం త్వరలో రాష్ట్రం నుంచి ఖాళీ అయ్యే రాజ్యసభ స్థానాలు అన్నింటినీ జగన్ పార్టీ గెలుచుకుంటుంది.ఆ వరమాల ఏదో తన మెడలో వెయ్యాలని సుబ్బారెడ్డి కోరుకుంటున్నారు.ఏం జరుగుతుందో చూడాలి ! ఎందుకంటే అక్కడ ఉన్నది జగన్ కనుక!!