నేడు కసాయి కథ ముగిసిందని… నాటి వాడి బాధితులను నడి రోడ్డున పడేయడాన్ని ఏమందాం..?
నేడు ఆ తూటా పేలలేదని… నాడు ఆ తూటాకీ ఎదురెళ్లిన వారిని ఆకలితో చంపేయడాన్ని ఏమందాం..?
నేడు కసబ్ లేడని… నాడు వాడు చేసిన గాయాన్ని మర్చిపోయి బతికేయడాన్ని ఏమందాం..?
దీన్ని ఏమందాం? నిస్సిగ్గు అందామా..? నిర్లక్ష్యం అందామా..? నెత్తికెక్కిన పాలన అందామా…? కాలుతున్న పేదల కడుపులపై కనికరం లేని పెద్దరికం అందామా…??
ఇదీ కథ…! దైన్య గాధ…!
కసబ్ అందరికీ గుర్తున్న పేరు. 26/11 ముంబై ఉగ్రదాడి సూత్రధారి, పాత్రధారి. నాడు ఆ హోటల్ లోని 67 మంది అమాయకులను పొట్టన పెట్టుకున్న కసాయి. ఆ దాడిలో వాడి తూటాకు గాయపడిన వాళ్లు కొందరు కోలుకున్నారు, కొందరు శాశ్వత వికలాంగులుగా మారారు. ఈ ఫొటోలోని శ్రీ వర్ధంకార్ మాత్రం తూటా గాయం నుండి కోలుకుని.., వాడికి వ్యతికేకంగా కోర్టులో సాక్ష్యం చెప్పారు. అదే వ్యక్తి నేడు ఆకలితో ముంబై నడి రోడ్డున పడిన దీన కథ ఆయనది.
తిండి లేదు… నీడ లేదు…!
పేరు హరిశ్చంద్ర శ్రీవర్ధంకార్..! ముంబై దాడుల్లో ప్రత్యక్ష సాక్షి. కోర్టుకి తిరిగినంత కాలం పోలీసులు, ప్రభుత్వం అతన్ని పట్టించుకున్నారు. తర్వాత గాలికొదిలేశారు. అన్నిటినీ కోల్పోయిన ఆయన కొద్దీ రోజులుగా కడుపుకి తిండి లేక.., ఆకలితో అలమటిస్తూ రోడ్డు పక్కన ఓ ఫుట్ పాత్ పై దొర్లుతూ గడుపుతున్నాడు. ఇలా అభాగ్యుడిగా పడి ఉన్న ఈయనను కొద్దీ రోజుల కిందట ఓ దుకాణదారుడు గమనించి అతనికి చేతనైన సాయం చేశారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి భోజనం పెట్టి తీసుకువెళ్లారు. ఈ ఘటన మనకు, మన సమాజానికి, మన దేశానికి.., మన పాలకులకు ఏం సందేశం ఇస్తుంది..?? ఏం నేర్పుతుంది..? దీన్ని ఏమనాలి..?
కసాయి కసబ్ ని నాలుగేళ్లు పోషించలేదా…?
జైల్లో బిరియానీలు పెట్టి సపర్యలు చేయలేదా..??
మరి అతని బాధితులని రోడ్డున పడేస్తే ఎలా…??? ఎన్ని పథకాలు ఉంటే ఏం లాభం..? ఎన్ని నీతి వాక్యాలు వల్లిస్తే ఏం ఉపయోగం..!!