రెండు చీమలు మాట్లాడుకుంటుంటే మధ్యలో ఒక దోమ ఎంటరవ్వడంతో అటుగా వెళుతున్న పాము ఒకటి వారి వైపు పాక్కుంటూ రావడాన్ని చూసి జామ చెట్టు ఆకు మీద వాలిన పిట్ట వాటి దగ్గర వాలడం..అక్కడేదో జరుగుతుందని కుక్క ఒకటి మొరగడం..నెమలి, నక్క, జింక, చిలక, ఎలుక వగైరా వగైరా జీవాలు అటుగా పరుగున వచ్చి చేరుకోవడం అన్నీ క్షణాల్లో జరిగిపోయాయి.
‘’చీమా చీమా మీరేంటి మాట్లాడుకుంటున్నారు’’ అని దోమ అడిగింది. పాముకు చెవులుండవు కాబట్టి కళ్ళనే మిటకరించింది, అదే ప్రశ్న నాది కూడా అన్నట్టు. కుక్క అరవడం మాని తోక ఊపుతోంది. పక్షి రెండు రెక్కలూ ఆడించింది. ఈ లోపు ఆరుద్ర పురుగు మొదలుకొని ఏనుగు వరకూ అడవిలో ఉన్న జంతుజాలమంతా అక్కడే గుమిగూడాయి. ఈ విచిత్రాన్ని చూసి షేక్స్పియర్ నాటకంలో లాగా అడవిలో చెట్లన్నీ నడుచుకుంటూ వచ్చి వాటి చుట్టూ నిలబడ్డాయి.
చీమ పెద్దగా అరుస్తూ ఇలా అంది. ఈ రోజు జూన్ 5. ప్రపంచ పర్యావరణ దినోత్సవం. మనుషులు స్వార్థపరులని మనకి తెలుసు. వాళ్ళ స్వార్థమే వాళ్ళ నాశనానికి హేతువు అవుతుందని కూడా తెలుసు. కాని వాళ్ళ కర్మకు మనమెందుకు బలవ్వాలని మేమిద్దరం విచారిస్తున్నాం. ఇంతలో మీరంతా ఇక్కడకు చేరారు.
చీమ ఇలా అనేసరికి దోమతో సహా అక్కడకు చేరిన జీవులన్నీ నోళ్ళు తెరిచి ఆ…అన్నాయి. ‘’మనిషి తను మునగడమే కాక మనల్ని కూడా ముంచేస్తాడన్న మాట.’’ ఇలా జంతువులన్నీ తమ కామన్ భాషలో ఒకేసారి గట్టిగా అన్నాయి.
‘మరి ఏం చేద్దాం ఏం చేద్దాం’, జంతువుల్లో కలవరం మొదలైంది. చీమ దీర్ఘంగా ఆలోచించి ఎన్ని సంవత్సరాలు..ఎన్ని నెలలు..ఎన్ని రోజులు..ఎన్ని గంటల్లో ఈ భూగోళం పుట్టి మునుగుతుందో తెగేసి చెప్పేసింది.
కృత్రిమ సౌకర్యాల వెంపర్లాటలో పడి మనిషి కృత్రిమంగా మారిపోయాడు. కృత్రిమ చల్లదనం..కృత్రిమ వెచ్చదనం.. కృత్రిమ మేఘాలు..కృత్రిమ చందమామలు..కృత్రిమ దీవులు..కృత్రిమ ఆహారాలు.. కృత్రిమ జీర్ణాలు..అజీర్ణాలు.. అంతా తన చేతుల్లో ఉందనుకుంటున్న మనిషి తన ఉనికి మాత్రం తన చేతిలో లేదన్న విషయం గమనించడంలేదు. కృత్రిమంగా మారిపోతున్న మనిషి చేతుల్లో భూమి చిక్కి శల్యమైపోయింది. ‘’
చీమ ఉపన్యాసం సుదీర్ఘంగా సాగింది. జంతువుల్లో మళ్ళీ కలవరం. ‘ఏం చేద్దాం? ఏం చేద్దాం?’ ఇదే మాట.
‘మనిషి స్వార్థానికి మనిషే బలి కావాలి కాని మనమేం పాపం చేశాం?’ నక్క తెలివిగా ప్రశ్నించాననుకుని గట్టిగా ఊళ పెట్టింది. నిజమే నిజమే అని అక్కడ మిగిలిన జీవాలు గొంతు కలిపాయి.
‘ఏం చేద్దాం ఏం చేద్దాం?’ మళ్ళీ ఇదే మాట.
‘మనిషి కృత్రిమ భూమిని సృష్టించుకుంటాడేమో.’దోమ గియ్యుమంటూ మోగింది.
‘’ ఏదో ఒకటి చావమనండి. మన గతేం కావాలి? మనిషి జవాబు చెప్పి తీరాలి.
మనుషులు తమ కోసం ఉద్యమాలు చేస్తారు. విప్లవాలు నడుపుతారు. తిరుగుబాట్లు సాగిస్తారు. అంతా తమ కోసమే. కాని ఈ భూమ్మీద తమకెంత హక్కుందో మిగిలిన జీవులకు కూడా అంతే హక్కుందని మాత్రం గమనించరు. మనిషికి మనిషే శత్రువు. కానీ మిగిలిన సమస్త జీవరాశికీ ఉమ్మడి శత్రువు మనిషే. కాబట్టి మన ఉనికిని చాటుకోవాలంటే మనమూ తిరగబడాలి. మనిషి మీద తిరుగుబాటు బావుటా ఎగరేయాలి.’’ పాము బుస్సుమంది.
‘’సమరానికి నేడే ప్రారంభం. నరజాతికి మూడెను ప్రారబ్ధం. జంతులోకమున చైతన్యానికి తిరుగే లేదని చాటిద్దాం.. ‘’చిలక నోట ఈ పాట రావడంతో మిగిలిన జంతువుల్లో ఉత్సాహం ఇనుమడించింది.
‘’అవును తిరగబడదాం. తిరగబడదాం. అంతకు ముందు మనం ఒక శిఖరాగ్ర సమావేశం నిర్వహించి మానవాళికి ఒక అల్టిమేటం జారీ చేద్దాం .’’జింక చేసిన ఈ ప్రతిపాదనకు జంతువులన్నీ ‘ఓకే ఓకే అలా చేద్దాం ‘ అని ముక్త కంఠంతో అడవి అదిరిపోయేలా అరిచాయి. అన్నీ వెళుతూ వెళుతూ చీమకు కృతజ్ఞతలు చెప్పాయి. చీమ ముందు చూపును రకరకాల భంగిమలతో కొనియాడాయి. చివరికి చెట్లు కూడా మేం మనుషులతో ఉండము, మీతోనే ఉంటామని జంతువులకు వాగ్దానం చేసి మళ్ళీ నడుచుకుంటూ యథాస్థానాలకు వెళ్ళిపోయాయి. అంతా తలా ఒకదారిలో వెళ్ళిపోయాక, చీమలు రెండే మిగిలాయి. అవి ఇలా మాట్లాడుకున్నాయి.
‘’ఒరే మనం మాట్లాడుకుంటున్న పథకం మాట తప్ప అన్నీ చెప్పావు. ‘’ అంది రెండో చీమ
‘’పిచ్చ సన్నాసీ. మనిషి ఈ భూగోళానికి అన్ని వైపులా నిప్పంటించేసి ఒక్కసారిగా మరో గ్రహానికి వెళ్ళిపోయే ప్లాన్లో ఉన్నాడు కదా. అప్పుడు మనిషి ఏ అంతరిక్ష నౌకలో పయనిస్తాడో అదే వాహనంలో మన జాతినంతటినీ దూరిపోయేలా చేయాలన్నది మన వ్యూహం. ఈ విషయం మిగిలిన జంతువులకు చెప్తే ఊరుకుంటాయా చెప్పు? అవి మనతో పాటు రహస్యంగా రాలేవు. ఆ సౌకర్యమూ, అంత చిన్న శరీరాలు మనకే ఉన్నాయి. అఫ్ కోర్స్ దోమల్లాంటివి కూడా కొన్ని ఉన్నాయనుకో. వాటిలో మనకున్న ఐకమత్యం లేదు. కనుక నీ తెలివితక్కువతనంతో మన పథకాన్ని లీక్ చేయకు.’’ మొదటి చీమ హెచ్చరించింది.
“ఇది తప్పు కదరా. జంతు న్యాయానికి విరుద్ధం కదా.’’ రెండో చీమ ఛీత్కరించింది.
‘’తప్పూ లేదు..పప్పూ లేదు. మన బతుకు మనం చూసుకుందాం. అందరితో పాటే ఉందాం. మనకి అవకాశం వచ్చినప్పుడు మనం ఎగిరిపోదాం. సృష్టిలో ప్రతి జీవికీ ఎంతో కొంత స్వార్థముంటుంది. మన స్వార్థమే మనల్ని కాపాడేది. మనిషి స్వార్థం తనతోపాటు ఇతరుల్నీ నాశనం చేసేది. మనిషి భస్మాసురుడు. తనను తాను భస్మం చేసుకునే దాకా వాడికి నిద్ర పట్టదు. మరో గ్రహానికి పోతే అక్కడ మనిషి కంటే బలవంతులు..నీతిమంతులు తప్పక ఉంటారు. వారి చేతుల్లో ఈ మనిషి బూడిద కాక తప్పదు. అప్పుడు మనమక్కడ జీవులన్నీ పరస్పరం ప్రేమతో మసలే వాతావరణంలో హాయిగా వుందాం. అయినా ఇదంతా ఇప్పుడే జరిగిపోతున్నట్టు ఓ తెగ ఫీలైపోతున్నావేంట్రా. ఇంకా చాలా చాలా యుగాల టైముందిలే. మన ముందు తరాలకు ఓ దారి వేయాలి కదా అని నీతో చర్చించాను అంతే. అప్పటి దాకా మిగిలిన జీవాలతోనే మనమూ పోరాటం సాగిద్దాం. ‘’ అంది మొదటి చీమ.
అంతేనంటావా. అయితే ఓకే అంది రెండో చీమ. రెండూ చకచకా నడుచుకుంటూ ఆ పక్కనే కవాతు చేసుకుంటూ వెళుతున్న చీమల సమూహంలో కలిసిపోయాయి. వాస్తవానికి మిగిలిన జీవాలు కూడా విడివిడిగా తమలో తాము ఇలాగా మాట్లాడుకుంటూ వాటి వాటి వ్యూహాలతో అవి ముందుకు కదిలాయి. పచ్చని పర్యావరణం కోసం అంతా కలిసి పని చేయాలన్న తలంపులో ఎలాంటి భేదాలూ లేవు. ప్రాణం మీదకొచ్చినప్పుడు ఎవరి దారి వారిదే అన్న ఎరుక కూడా ఉంది. మనిషి మీద మాత్రం యావత్తు జీవకోటి కసి మాత్రం ఒక్కటే. ఏమైనా మనిషి మీద తిరగబడాలి.
-డా.ప్రసాదమూర్తి
ఎల్లో జర్నలిజం నడుమ జాతీయ పత్రికా దినోత్సవం…పత్రికా స్వేచ్ఛ ఒక భ్రమ