ఈ దేశంలోని యువత నా మనసు దోచుకుంది. నా అరచేతుల్లో వారిప్పుడు జవనాశ్వాలై పరుగులు తీస్తున్నారు. నా గుండెల్లో యువకులు తరంగాలు తరంగాలుగా నింగిని తాకి నేలకు దూకుతున్నారు. యువకులు నా నరనరంలో కొత్త నెత్తురు నింపి నా సకలావయవాల్లో కొత్త మొలకలు పుట్టిస్తున్నారు. విద్యార్థులు నవసమాజ నిర్మాతలురా.. విద్యార్థులు దేశ భావి నిర్ణేతలురా. విప్లవాలు చేసినా వినోదాలు చూపినా అన్నిటనూ పై చేయి విద్యార్థులదే. ప్రగతి ఆగిపోవు విద్యార్థులు ముందు లేనిదే అన్న పాట చిన్నప్పుడు ఎప్పుడు విన్నా వెన్నెముకలో చరచరా ఏదో కదిలేది. గుండెల్లో అలలేవో ఉప్పొంగేవి. ఇప్పుడు దేశంలో విద్యార్థుల చైతన్యాన్ని చూస్తుంటే అదే భావన మనసంతా కమ్ముకుంటోంది. దేశం ప్రమాదకర అంచుల్లోకి చేరింది. ఏ దేశ స్వాతంత్ర్యం కోసం కులాతీత మతాతీత చైతన్యంతో ప్రజలంతా సమైక్యంగా కదిలారో అదే ప్రజల్లో ఇప్పుడు మతం పేరుతో నిప్పులు పోస్తున్నారు. సర్ కటాసక్తే మగర్ సర్ ఝుకాసక్తే నహీ అని జాతీయపోరాటంలో యువత ఘీంకరించింది. అందరూ కలిసి సాధించుకున్న స్వాతంత్ర్యాన్ని కొందరికే కట్టబెట్టి కొందరిని మతం పేరుతో ఏరిపారేసే కుట్రలు చూసిన యువత మరోసారి అగ్నితరంగాలై పైకి లేచింది. మేం ముక్కలైనా సహిస్తాం కాని దేశాన్ని ముక్కలు కానివ్వమంటూ విద్యార్థులు భూమ్యాకాశాలు దద్దరిల్లేలా నినదిస్తున్నారు. కొంతమంది యువకులు ముందు తరం దూతలు అంటే ఏంటో ఆచరణలో చూపిస్తున్నారు. వారికి నా హృదయం అంకితమైపోయింది.
దేశమంటే హిందువులే కాదని..దేశమంటే బౌద్ధులు..ఫారసీకులు..జైనులు..క్రైస్తవులు మాత్రమే కాదని, దేశమంటే ముస్లింలు కూడా అని యువకులు దేశం గుండెల మీద గుద్ది చెప్తుంటే ఆసేతు హిమాచలం హారతి పట్టింది. కేవలం ముస్లిం యువత మాత్రమే ఈ అల్లరి చేస్తున్నారని వక్రీకరించడానికి ఏలిన వారు చేసిన యత్నాలు ముక్కలైపోయాయి. మతాతీతంగా అందరూ ఈ ఉద్యమంలో భాగస్వాములయ్యారు. ఇంత ఉవ్వెత్తున యువత దేశాన్ని కాపాడుకోవడానికి ఇలా ప్రాణాలకు తెగించి యుద్ధంలోకి దూకడం ఈ మధ్య కాలంలో మనం చూడని వింత. తర్వాత్తర్వాత ఇదేదో విపక్షాల కుట్రగా పాలకపక్షం వారు చిత్రించడానికి చేసిన యత్నాలు కూడా చెక్కలయ్యాయి. ఇప్పుడు ఏకంగా సైన్యాధినేత రంగంలోకి దిగి శాంతి సామరస్యాల కోసం పోరాడుతున్న విద్యార్థులను విలన్లుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. ఇది దేశ చరిత్రలో కనీవినీ ఎరుగని పరిణామం.
మతం ప్రాతిపదికగా దేశాన్ని ముక్కలు చెయ్యాలనుకుంటున్న వారు దేశభక్తులు. మతతత్వం కాదు..లౌకికత్వమే మన దేశానికి ఆయువుపట్టని తమ భవిష్యత్తును పణంగా పెట్టి ఉద్యమంలోకి ఉరికిన వారు దేశద్రోహలు. ఇదీ వర్తమాన చరిత్ర. రాజ్యాంగాన్ని ధ్వంసం చేసే వారు దేశభక్తులు. రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి జీవితాలను అర్పించడానికైనా సిద్ధపడిన వారు దేశద్రోహులు. ఇదీ నడుస్తున్న చరిత్ర. ఎవరు దేశభక్తులో..ఎవరు దేశద్రోహులో దేశం పోల్చుకుంటున్నది. అందుకే కాశ్మీరు నుంచి కన్యాకుమారి వరకూ సహజీవన సౌందర్యాన్ని రక్షించుకోవడానికి సమరం సాగిస్తోంది యువత. యువకులు నా మనసు దోచుకున్నారు. మత గ్రంథాలు వేరైనా మందిరాలు వేరైనా మనుషులం ఒక్కటే మన మనసులూ ఒక్కటే అంటున్నారు యువకులు. మనుషుల్ని విడదీసే చట్టాలు కాదు..మనుషుల్ని కలిపి నిలిపే చట్టాలు కావాలని యువత డిమాండ్ చేస్తోంది. విభజన మీ చట్టమైతే ఐక్యత మా ప్రాణమంటున్నారు. ద్వేషం మీ ఆయుధమైతే శాంతి మా ఆయువు అంటున్నారు. నిప్పు కనపడకుండా పెట్టే చిచ్చును, నెత్తురు కనపడకుండా సాగించే హింసను నెత్తురు ధారపోసైనా అడ్డుకుంటామంటున్న నింగికెగసిని యువతేజాన్నిచూస్తే మనసు ఉద్వేగభరితమవుతోంది. ఆశ చచ్చిపోతున్న నాడుల్లో ఎక్కడో జీవాన్ని నింపుతోంది ఈ దేశం యువత.
ఎవరి బతుకు వారు బతకడానికే కాదు
కలిసి బతకడానికి కూడా ఇక్కడ యుద్ధమే చేయాలి
మత రాజకీయంతో ఒక దేశాన్ని విభజించలేరు
ఓటు రాజకీయంతో ఒక దేశాన్ని పాలించలేరు
విద్వేషం ఆయుధంగా ఒక దేశాన్ని ఓడించలేరు
ఏలికల పాచికల్ని పటాపంచలు చేసే యువత మేలుకొంది
మీ ఎత్తులు సాగవిక..మీ జిత్తులు పారవిక
ఇవిగో నా అక్షరాల కళ్ళల్లోకి చూడండి
కదం తొక్కుతున్న యువ తురంగాల యుద్ధహేల..
డా. ప్రసాదమూర్తి
ఎల్లో జర్నలిజం నడుమ జాతీయ పత్రికా దినోత్సవం…పత్రికా స్వేచ్ఛ ఒక భ్రమ